ప్రముఖ స్ప్రింటర్ మిల్కా సింగ్ ఇంట విషాదం నెలకొంది. మిల్కా సింగ్ భార్య, భారత మహిళల వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ నిర్మలా కౌర్ కరోనాతో కన్నుమూశారు. ఆవిడ వయస్సు 85 సంవత్సరాలు. గతనెల ఆమె కరోనా బారిన పడడంతో చండీగఢ్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ.. గత వారం రోజులుగా ఆమె పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆదివారం ఆమె కన్నుమూసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు మిల్కా సింగ్ సైతం కరోనాతో నిర్మల చేరిన ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నారు. చికిత్సకు బాగా స్పందించిన ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. కానీ, ఆయనపై ఇంకా వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భార్య నిర్మల అంత్యక్రియలకు మాత్రం ఆయన హాజరు కాలేకపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 85 ఏళ్ల నిర్మల పంజాబ్లో 'డైరెక్టర్ ఫర్ స్పోర్ట్స్ ఫర్ వుమెన్'గా కూడా వ్యవహరించారు.