కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతోందన్నారు. రాజకీయ నేతలు ఫోన్లో ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ కేంద్రానికి తెలుసునని అన్నారు. బీజేపీలోని తన స్నేహితులతో ఫోన్లో మాట్లాడక తన కాల్స్ అన్నీ డైవర్ట్ అవుతున్నాయంటూ ట్వీట్లు చేశారు.
"ఈ కొత్త భారత్లో రాజకీయ నాయకులు ఇతర పార్టీ నేతలతో మాట్లాడాలంటే భయపడుతున్నారు. 'బిగ్బ్రదర్'కు అన్నీ తెలుస్తాయన్న భయం వారిలో కలుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ భయంతో పార్టీలకు అతీతంగా ఎంపీలు, ఆయా పార్టీల నేతలు తరచూ ఫోన్ నెంబర్లు మార్చేస్తున్నారు. అంతేకాదు నేతలు కలిసినప్పుడు కూడా గుసగుసలాడుకుంటూనే మాట్లాడుకుంటారు. భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంది." అంటూ మార్గరెట్ అల్వా ట్వీట్ చేశారు.
తన ఫోన్కు వచ్చే కాల్స్ను డైవర్ట్ చేస్తున్నారని, తాను కాల్స్ చేయలేకపోతున్నానని, రిసీవ్ చేసుకోలేకపోతున్నానని అల్వా తెలిపారు. ఈ సందర్భంగా ఎంటీఎన్ఎల్ సంస్థ నోటీసు పంపిన ఫొటోను షేర్ చేశారు. కేవైసీ సస్పెండ్ చేస్తున్నామని, మరో 24 గంటల్లో సిమ్ కార్డును బ్లాక్ చేస్తామని నోటీసులో ఉంది. అయితే ఇవి నకిలీ నోటీసులు అంటూ అంతకుముందే దిల్లీ పోలీసులు హెచ్చరించారు. ఇది కేవైసీ స్కామ్లో ఒక రకమని పోలీసులు తెలిపారు. కాగా ఈ వ్యవహారంపై బీఎస్ఎన్ఎల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అల్వా ఫిర్యాదుపై తగిన చర్యలు చేపట్టామని, ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ను బీఎస్ఎన్ఎల్ దాఖలు చేసిందని టెలికాం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
అల్వా చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తోసిపుచ్చారు. ఆల్వా చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆమె ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం తమకు ఏముందని ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుస్తారన్న నమ్మకం ఉందన్నారు. అల్వా చేసిన ఆరోపణల్లో అర్థం లేదన్నారు. సీనియర్ రాజకీయ నేత అయ్యి ఉండి ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తగదని ప్రహ్లాద్ జోషి హితవు పలికారు.