అరగంట వ్యవధిలో జైపూర్‌ను వణిికించిన వరుస భూకంపాలు

రాజస్థాన్‌లోని జైపూర్‌లో వరుస భూకంపాలు సంభవించాయి.

By Srikanth Gundamalla  Published on  21 July 2023 5:45 AM GMT
Manipur, Earthquake, Early Morning,

అరగంట వ్యవధిలో జైపూర్‌ను వణించిన వరుస భూకంపాలు

రాజస్థాన్‌లోని జైపూర్‌లో వరుస భూకంపాలు సంభవించాయి. కేవలం అరగంట వ్యవధిలోనే మూడుసార్లు భూప్రకంపనలు వచ్చాయి. దాంతో.. ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో వరుసగా భూమి మూడు సార్లు కంపించింది.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) ప్రకారం.. మూడు భూకంపాలు కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే సంభవించాయి. మొదటిసారి భూకంపం ఉదయం 4:09 గంటలు వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై మొదటిసారి తీవ్రత 4.4గా నమోదు అయ్యింది. ఏం జరిగిందా అని ప్రజలు నిద్ర మేల్కొని తేరుకునే లోపే మరోసారి భూమి కంపించింది. ఉదయం 4:22 గంటల ప్రాంతంలో రెండోసారి భూకంపం వచ్చింది. ఇక రెండోసారి తీవ్రత 3.1గా నమోదు అయ్యినట్లు అధికారులు తెలిపారు. రెండుసార్లు భూకంపం సంభవించడంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. అలా భయపడుతుండగానే.. మూడోసారి కూడా భూకంపం వచ్చింది. ఈ సారి కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే భూమి కంపించింది. అంటే ఉదయం 4:25 గంటలకే భూకంపం సంభవించింది. ఇక మూడో సారి రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.4గా నమోదు అయ్యింది. వరుస భూకంపాలతో ప్రజలంతా భయపపోయారు.

గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించడంతో ప్రజలంతా ఉలిక్కిపడి లేచారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అలా వరసగా భూకంపం రావడంతో ఆందోళన చెందారు. కాగా.. మూడు సార్లు ఎక్కుత తీవ్రత లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. తెల్లవారుజామున భూంకంప సంభవించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పెద్ద శబ్దాలతో పార్క్‌ చేసిన కార్లు ఒక్కసారిగా ఊగిపోయాయి.

వరుసగా భూకంపాలు సంభవించడంపై రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే స్పందించారు. 'రాజస్థాన్‌లో సంభవించిన వరుస భూకంపాల తర్వాత ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నా'అంటూ ట్వీట్‌ చేశారు. కాగా..మణిపూర్‌లో కూడా శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉక్రుల్‌ ప్రాంతంలో ఉదయం 5 గంటలకు 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మణిపూర్‌లో భూమి కంపించిన విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారికంగా వెల్లడించింది. మణిపూర్‌లో కూడా తీవ్రత తక్కువగా ఉండటంతో.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.

Next Story