గత 13 ఏళ్లుగా అపస్మారక స్థితిలో (కోమా) ఉండి, కోలుకునే అవకాశం లేని 32 ఏళ్ల హరీష్ రాణాకు నిష్క్రియ కారుణ్య మరణం ప్రసాదిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. భారత న్యాయస్థాన చరిత్రలో కోర్టు ఆదేశాల ద్వారా ఒక వ్యక్తికి కారుణ్య మరణాన్ని అనుమతించడం ఇదే మొదటిసారి. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ భావోద్వేగపూరిత తీర్పును వెలువరించింది.
హరీష్ రాణాకు అందుతున్న వైద్య సహాయాన్ని (లైఫ్ సపోర్ట్) నిలిపివేసేందుకు అతని తల్లిదండ్రులకు కోర్టు అనుమతినిచ్చింది. ఇలాంటి కేసుల్లో మరణం రోగికి ప్రయోజనకరమా కాదా అన్నది ముఖ్యం కాదని, జీవన సహాయక చికిత్సను కొనసాగించడం వల్ల రోగికి ఏవైనా ప్రయోజనాలు ఉన్నాయా లేదా అన్నదే కీలకమని ధర్మాసనం స్పష్టం చేసింది. క్లినికల్ పద్ధతిలో అందించే ఆహారం కూడా వైద్య చికిత్స కిందకే వస్తుందని, రికవరీ అయ్యే అవకాశం లేదని మెడికల్ బోర్డు నిర్ధారిస్తే దానిని నిలిపివేయవచ్చని కోర్టు వెల్లడించింది.
హరీష్ రాణా నేపథ్యం:
2013లో తన ఇంటి నాలుగో అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కింద పడటంతో హరీష్ రాణా మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుండి అతను 'పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్' లో ఉన్నాడు. 13 ఏళ్లుగా అనేక చికిత్సలు అందించినప్పటికీ అతని పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేదని మెడికల్ నివేదికలు స్పష్టం చేశాయి.
కనీసం తన అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్న తన కుమారుడికి గౌరవప్రదమైన మరణాన్ని ప్రసాదించాలని కోరుతూ అతని తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో 'కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా, రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం 'గౌరవప్రదంగా మరణించే హక్కు' కూడా జీవించే హక్కులో భాగమేనని ధర్మాసనం పునరుద్ఘాటించింది.