తెరచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం.. పులకించిన భ‌క్తులు

Kedarnath Temple opens for pilgrims.ప్రముఖ శైవక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక‌టైన కేదార్‌నాథ్ ఆలయం ఈ రోజు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2022 7:25 AM GMT
తెరచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం.. పులకించిన భ‌క్తులు

ప్రముఖ శైవక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక‌టైన కేదార్‌నాథ్ ఆలయం ఈ రోజు(శుక్ర‌వారం) తెరుచుకుంది. వేద మంత్రోత‌చ్చార‌ణ‌లు, శివ‌నామ స్మ‌ర‌ణ‌ల మ‌ధ్య ఉద‌యం 6.26 గంట‌ల‌కు ఆల‌య ద్వారాలు తెర‌చుకున్నాయి. దీంతో భక్తులు తన్మయతంలో పులకించిపోయారు. ఈ ప‌విత్రోత్స‌వాన్ని ఉత్త‌రాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి తిల‌కించగా.. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు. ఆల‌య ద‌ర్శ‌నం పునఃప్రారంభం సంద‌ర్భంగా కేదార్‌నాథ్ క్షేత్రాన్ని 15 క్వింటాళ్ల పూల‌తో అలంక‌రించారు.

కేదార్‌నాథ్ ఆల‌యానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఈ ఆల‌యం ఏడాదిలో చాలా కాలం మంచుతో క‌ప్ప‌బ‌డి ఉంటుంది. కొన్ని రోజులు మాత్ర‌మే భ‌క్తులు ద‌ర్శించుకునేందుకు అనువైన స‌మ‌యం ఉంటుంది. మంచుతో క‌ప్ప‌బ‌డి ఉండే స‌మ‌యంలో ఆల‌యాన్ని మూసివేస్తారు. ప్ర‌స్తుతం సాధార‌ణ ప‌రిస్థితులు ఉండ‌డంతో ఈ రోజు ఉద‌యం ఆల‌యాన్ని తెరిచారు. కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ భ‌క్తులు ద‌ర్శించుకోవ‌చ్చు.

ఇక క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా చార్‌ధామ్ యాత్ర రెండు సంవ‌త్స‌రాలుగా నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర ఈ నెల 3న ప్రారంభ‌మైంది. గంగోత్రి, మ‌యునోత్రి ఆల‌యాల‌ను మంగ‌ళ‌వారం భ‌క్తుల కోసం తెరిచారు. కేదార్‌నాథ్ ఆల‌యం ఈరోజు తెర‌చుకోగా.. బ‌ద్రినాథ్ ఆల‌యాన్ని ఈ నెల 8న తెర‌వ‌నున్నారు. కొవిడ్ దృష్ట్యా యాత్రికుల సంఖ్య‌పై ప్ర‌భుత్వం రోజువారి ప‌రిమితిని విధించింది. కేదార్‌నాథ్ ఆలయానికి రోజువారీ పరిమితిని 12 వేల మంది, బద్రీనాథ్‌కు 15 వేల మంది, గంగోత్రికి 7 వేల మంది, మ‌యునోత్రికి 4 వేల మంది భ‌క్తుల‌ను అనుమ‌తిస్తున్నారు.

Next Story