కరోనా కష్టాలు.. అమ్మకానికి ఆర్టీసీ కండక్టర్ కిడ్నీలు
Karnataka Bus Conductor Puts Kidney On Sale To Meet Financial Needs.కరోనా వైరస్ మనుషుల జీవితాలను అతలాకుతలం
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్ మనుషుల జీవితాలను అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి దాటికి ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోగా.. చాలా మంది వేతనజీవుల జీతాల్లో కోతలు విధిస్తున్నారు. దీంతో సామాన్యుల బ్రతుకు బారంగా మారింది. వారిని ఆర్థిక కష్టాల్లోకి నెట్టింది. ఈ కష్టాల కడలి ఈదలేక ఓ వ్యక్తి ఏకంగా తన కిడ్నీలను అమ్మకానికి పెట్టాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ వార్త చూసిన వారి మనసులను కలచివేస్తుంది.
కర్ణాటక రాష్ట్రంలో ఆర్టీసీ కండక్టర్గా హనుమంత్ (38) పనిచేస్తున్నారు. లాక్డౌన్ ప్రభావంతో సంస్థ జీతాల్లో కోత విధించింది. దీంతో వచ్చే జీతంతో కుటుంబ పోషణతో భారమైంది. దీంతో తీవ్రమైన ఆర్థిక సమస్యలు వచ్చిపడ్డాయి. ఇంటి అద్దె, పిల్లలు చదువుకు వచ్చే జీతం సరిపోవడం లేదు. దీంతో తన కిడ్నీని అమ్మకానికి పెడుతున్నట్లు పేసుబుక్లో పోస్ట్ చేశాడు.
'నేను రవాణా సంస్థలో కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నా. కోతలతో కూడిన జీతం సరిపోవడం లేదు. రేషన్, ఇంటి అద్దె, పిల్లల చదువులు భారంగా మారాయి. డబ్బు కోసం నా కిడ్నీని అమ్మాలని నిర్ణయించుకున్నా. ఆసక్తి ఉన్నవాళ్లు నాకు ఫోన్ చేయండి.' అంటూ హనుమంతు తన ఫోన్ నెంబర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి నార్త్ ఈస్ట్ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ సంబంధించిన ఫేస్బుక్ పేజీని ట్యాగ్ను జత చేశాడు.
ప్రస్తుతం అతడు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆయనకు అండగా నిలుస్తున్నారు. కిడ్నీలు అమ్మొద్దు అంటూ సలహా ఇస్తున్నారు. అతడు పెట్టిన పోస్టుపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. హనుమంతు సక్రమంగా ఉద్యోగానికి రాకపోవడంతో అతడికి తక్కువ జీతం వస్తుందని వివరణ ఇచ్చారు. ఈ విషయమై అతడిని చాలా సార్లు హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు.