బీజేపీ అనూహ్య నిర్ణయం.. ప్రకటించిన కాసేపటికే తొలి జాబితా రద్దు
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి రాజకీయ పార్టీలు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 12:40 PM IST
బీజేపీ అనూహ్య నిర్ణయం.. ప్రకటించిన కాసేపటికే తొలి జాబితా రద్దు
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి రాజకీయ పార్టీలు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాబోయే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మూడు దశల కోసం 44 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. అయితే వెంటనే దానిని ఉపసంహరించుకుంది. కొన్ని సవరణల అనంతరం జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
జాబితాను తొలగించడానికి ముందు.. జమ్ముకశ్మీర్లో మూడు దశల ఎన్నికలకు గాను బీజేపీ అభ్యర్థుల లిస్ట్ను విడుదల చేసింది. మొదటి దశ (సెప్టెంబర్ 18) కోసం 15 మంది అభ్యర్థులను, రెండవ దశ (సెప్టెంబర్ 25) కోసం 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక మూడవ దశ (అక్టోబర్ 1) కోసం 19 మంది అభ్యర్థులను వెల్లడించింది బీజేపీ. కానీ. లిస్ట్ ప్రకటించిన కాసేపటికే దాన్ని రద్దు చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఉపసంహరించుకున్న జాబితాలో జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, మాజీ ఉప ముఖ్యమంత్రులు నిర్మల్ సింగ్, కవీందర్ గుప్తాలు ఉన్న ముగ్గురు ప్రముఖుల పేర్లు లేవు. ఇక జమ్ముకశ్మీర్లో మరింత బలమైన నాయకులను బరిలో నిలబెట్టి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని మార్పులు జరగక తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1 వరకు మూడు దశల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఫలితాలు అక్టోబర్ 4న వెల్లడికానున్నాయి.