కరోనా దేశావ్యాప్తంగా ప్రళయం సృష్టిస్తోంది. దీని దెబ్బకి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్ లో యువతలో మరణాల రేటు పెరిగింది. ఎంతో దృడంగా ఉన్న వాళ్ళని సైతం కరోనా పిండి పిండి చేసేస్తోంది. తాజాగా ఒక బాడీ బిల్డర్ కరోనా మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డాడు.
నిజానికి మనదేశంలో బాడీ బిల్డర్లను వెళ్ళమీద లెక్క పెట్టచ్చు.. వాళ్లలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 34 ఏళ్ల జగదీష్ లాడ్ ఒకరు. బాడీబిల్డింగ్లో అన్ని అగ్రశ్రేణి టైటిళ్లు గెలుచుకున్న బాడీబిల్డర్ జగదీష్ లాడ్ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. కఠినమైన ప్రత్యర్థులతో పోరాడి, ఎంతో మందికి ఫిట్నెస్ ట్రైనర్ గా, ఉన్న వ్యక్తి కరోనాతో పోరాటంలో నిస్సహాయుడై పోయాడు. బాడీ బిల్డింగ్ లో సుమారు 8 సంవత్సరాలు ఫామ్ లో ఉన్న జగదీశ్ లాడ్ ఇప్పుడు ఆసుపత్రి బెడ్ పై విగత జీవిగా మారాడు.
దేశానికి ఎన్నో పతకాలు తెచ్చి పెట్టిన ఈ బాడీబిల్డర్ కరోనాతో వడోదరలోని ఒక ఆసుపత్రిలో చేరాడు. నాలుగు రోజులు ఆక్సిజన్ సపోర్ట్ తీసుకున్న జగదీశ్ శుక్రవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.
జగదీష్ లాడ్ చిన్న వయస్సులోనే బాడీబిల్డింగ్ ప్రారంభించాడు. మహారాష్ట్రలో దాదాపు నాలుగు సార్లు బంగారు పతకం సాధించాడు. మిస్టర్ ఇండియా పోటీలో రెండు బంగారు పతకాలు కూడా గెలుచుకున్నాడు. ముంబైలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. ఆయన మరణానికి మహారాష్ట్ర బాడీబిల్డింగ్ అసోసియేషన్, ముంబై అసోసియేషన్ సంతాపం తెలిపాయి.