ప్ర‌యాణీకుల‌కు అల‌ర్ట్‌.. రైల్వే టికెట్ బుకింగ్ కు అవి తప్పనిసరి..!

Indian Railways plans linking of these documents for booking tickets on IRCTC.రైల్వే టికెట్ బుకింగ్స్‌లో అక్రమాలను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2021 6:36 AM GMT
ప్ర‌యాణీకుల‌కు అల‌ర్ట్‌.. రైల్వే టికెట్ బుకింగ్ కు అవి తప్పనిసరి..!

రైల్వే టికెట్ బుకింగ్స్‌లో అక్రమాలను అరికట్టేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతోంది. ఇక నుంచి టికెట్లు బుక్ చేయాలంటే ఖ‌చ్చితంగా ఆధార్ లేదా పాన్ కార్డు లేదా పాస్‌పోర్ట్ వంటి ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందేన‌ని అంటోంది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు అక్రమార్కులు పెద్ద సంఖ్యలో టికెట్లను బుక్ చేసుకుని వాటిని రెట్టింపు ధరలకు ప్రయాణికులకు అమ్ముతున్నారు. తద్వారా మోసాలకు తెరతీస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలను మొదలు పెట్టింది.

అలాగే వెబ్‌సైట్‌లోనూ భారీగా మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇకనుంచి యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ తో కాకుండా కేవలం ఆధార్ నంబర్‌ లేదా పాస్‌పోర్ట్‌ నంబర్‌తో లాగిన్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల టికెట్ బుకింగ్‌ల్లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ పేర్కొంది. అందుకే ఆధార్, పాస్‌పోర్ట్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

'టికెట్ బుకింగ్ కోసం లాగిన్ కావాలంటే ఇకనుంచి ఆధార్ కార్డు, పాస్‌పోర్టు వంటి పత్రాలు తప్పనిసరి చేసేందుకు ఐఆర్‌సీటీసీతో కలిసి మేము పని చేస్తున్నాం. ఆధార్ కార్డును చేర్చే ప్రక్రియ చివరి దశలో ఉందని' అని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ అరుణ్ కుమార్ చెప్పారు. ట్రైన్‌ టిక్కెట్లు వేగంగా బుక్‌ చేసేందుకు ఏజెంట్లు ఇతర సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి సమయంలో సాధారణ ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవాలంటే చాలా సమయం పడుతుందని కొన్ని సోర్సులు వెల్లడిస్తున్నాయి. కొందరు ఏజెంట్లు అక్రమాలకు పాల్పడుతూ తప్పుడు పేర్లతో టికెట్లు బుక్ చేసుకుని, ప్రీమియం రేట్లకు అమ్ముకుంటున్నార‌న్నారు.

2019వ సంవత్సరం నవంబర్ నెలలోనే దీనికి సంబంధించిన పనిని మొదలు పెట్టామని ఆయన వెల్లడించారు. 2021 సంవత్సరం మే నెల వరకు టికెట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్న 14,257 మందిని అరెస్ట్ చేశామన్నారు.

Next Story