ఇండియా పోస్ట్‌ కొత్త సర్వీసులు.. 24 గంటల్లో డెలివరీ.. లేకపోతే డబ్బులు వాపస్‌

సమయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారుల కోసం తపాలా శాఖ '24 స్పీడ్ పోస్ట్' సేవలను మార్చి 17 (మంగళవారం) నాడు అధికారికంగా ప్రారంభిస్తోంది.

By -  అంజి
Published on : 17 March 2026 11:51 AM IST

India Post 24 Speed Post, Jyotiraditya Scindia, Dr Chandra Sekhar Pemmasani, Next Day Delivery, Hyderabad Speed Post, Department of Posts, OTP Based Delivery, Express Parcel Service

ఇండియా పోస్ట్‌ కొత్త సర్వీసులు.. 24 గంటల్లో డెలివరీ.. లేకపోతే డబ్బులు వాపస్‌

సమయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారుల కోసం తపాలా శాఖ '24 స్పీడ్ పోస్ట్' సేవలను మార్చి 17 (మంగళవారం) నాడు అధికారికంగా ప్రారంభిస్తోంది. ఈ సేవ ద్వారా పంపిన పోస్టులు మరుసటి రోజుకే (Next-Day) గ్యారెంటీగా డెలివరీ చేయబడతాయి. వీటితో పాటు '24', '48' స్పీడ్ పోస్ట్ సర్వీసుల ద్వారా బుక్ చేసిన రోజు నుంచి ఒకటి (D+1) లేదా రెండు (D+2) రోజుల్లోనే కచ్చితంగా గమ్యస్థానానికి చేరేలా ప్రత్యేక విభాగాలు, విమాన రవాణా సదుపాయాలను కేటాయించారు.

మొదటి విడతలో ఆరు నగరాలు:

ఈ ప్రతిష్టాత్మకమైన సేవలు తొలి దశలో దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా మరియు బెంగళూరు నగరాల మధ్య ఈ ఎక్స్‌ప్రెస్ డెలివరీ సదుపాయం పనిచేస్తుంది. భవిష్యత్తులో ఈ సేవలను ఇతర నగరాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

వినియోగదారుల భద్రత, నమ్మకం కోసం ఈ సేవలలో పలు కొత్త ఫీచర్లను జోడించారు. ఓటీపీ (OTP) ఆధారిత సురక్షిత డెలివరీ, ఎస్ఎంఎస్ ద్వారా ఎండ్-టు-ఎండ్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటాయి. వ్యాపారవేత్తల కోసం 'బుక్ నౌ - పే లేటర్' (BNPL) సదుపాయం, బల్క్ బుకింగ్స్‌కు ఉచిత పికప్, ఏపీఐ ఇంటిగ్రేషన్ వంటి అధునాతన సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, నిర్ణీత సమయంలోగా డెలివరీ కాకపోతే 'మనీ-బ్యాక్ గ్యారెంటీ' (డబ్బు తిరిగి ఇచ్చే) సౌకర్యాన్ని కూడా తపాలా శాఖ ప్రకటించింది.

న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్‌ గల రంగభవన్ ఆడిటోరియంలో మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పోటీగా ఇండియా పోస్ట్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనుంది.

Next Story