భారత్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో మొత్తం నమోదు అవుతున్న కేసుల్లో సగానికి పైగా ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 17,87,283 కరోనా శాంపిళ్లను పరీక్షించగా 46,164 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 46వేలకు పైగా కేసులు నమోదు అవ్వగా.. అందులో 31వేల కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే వెలుగుచూశాయి. నిన్న ఒక్క రోజే 607 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,36,365 మంది మృత్యువాత పడ్డారు.
నిన్న34,159 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,17,88,440కి చేరింది. దేశంలో ప్రస్తుతం 3,33,725 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.63శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.02 శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.58 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 80,40,407 మందికి టీకా వేశారు. ఇప్పటి వరకు 60.38 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.