హర్ ఘర్ తిరంగా..ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: మోదీ, అమిత్‌షా

అమిత్‌ షా కూడా హర్‌ ఘర్ తిరంగా కోసం ప్రజలకు పిలుపునిచ్చారు.

By Srikanth Gundamalla
Published on : 4 Aug 2024 7:31 AM IST

har ghar tiranga,august 15th,pm modi,amit shah

హర్ ఘర్ తిరంగా..ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: మోదీ, అమిత్‌షా

భారత దేశ త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ సెల్ఫీ తీసుకుని సోషల్‌ మీడియా ఖాతాల్లో అప్‌లోడ్‌ చేయాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. త్రివర్ణ పతాకాన్ని అందించడం కోసం పింగళి వెంకయ్య చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుంది అన్నారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆగస్టు 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటిపై ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. HarGharTiranga.comలో మీ సెల్ఫీని షేర్ చేయడం మర్చిపోవద్దని పేర్కొన్నారు.

ఇక కేంద్ర మంత్రి అమిత్‌ షా కూడా హర్‌ ఘర్ తిరంగా కోసం ప్రజలకు పిలుపునిచ్చారు. మన జాతీయ జెండా త్రివర్ణ పతాకం త్యాగం, విధేయత మరియు శాంతికి చిహ్నమని చెప్పారు. #HarGharTiranga ప్రచారం స్వాతంత్ర్య వీరులను స్మరించుకోవడమని చెప్పారు. జాతీయ ఐక్యతను పెంపొందించడానికి ఒక మాధ్యమం అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రెండేళ్లుగా ఈ ప్రచారం ఉద్యమంగా మారిందని అన్నారు. ఆగస్టు 9 నుండి 15 వరకు ప్రజలంతా ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఆ సెల్ఫీని https://harghartirang.comలో అప్‌లోడ్ చేయాలని కేంద్ర మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.


స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారంలో పాల్గొనాలని భారతీయులందరికీ పిలుపునిచ్చారు. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు ఇళ్లు, కార్యాలయాలు, దుకాణాల్లో జాతీయ జెండాను ఎగురవేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య.. 1876 ఆగష్టు 2న ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం సమీపంలో జన్మించారు. జాతీయ జెండాను రూపొందించడం ద్వారా ఆయన స్వతంత్ర భారతదేశ స్ఫూర్తికి పర్యాయపదంగా మారారు. 1963 జూలై 4న ఆయన తుది శ్వాస విడిచారు.

Next Story