250 మంది హజ్ యాత్రికులతో వచ్చిన సౌదీ ఎయిర్లైన్స్ విమానం ఆదివారం తెల్లవారుజామున లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే ల్యాండింగ్ గేర్లో సాంకేతిక లోపం తలెత్తిందని అధికారులు తెలిపారు. SV 3112 అనే విమానం శనివారం రాత్రి 10.45 గంటలకు జెడ్డా నుండి బయలుదేరి ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో లక్నోలో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన కొద్దిసేపటికే విమానం ఎడమ చక్రం నుండి పొగలు, నిప్పురవ్వలు వచ్చిన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
పైలట్ వెంటనే విమానాన్ని ఆపి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించాడు. ఆ తర్వాత విమానాన్ని వెనక్కి నెట్టి టాక్సీవేకు తరలించారు, అక్కడ ప్రయాణికులు , సిబ్బంది అందరూ సురక్షితంగా దింపబడ్డారు. విమానాశ్రయ అత్యవసర ప్రతిస్పందన బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, నురుగు, నీటిని ఉపయోగించి 20 నిమిషాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ఈ లోపం అకస్మాత్తుగా హైడ్రాలిక్ లీక్ కావడం వల్ల వీల్ అసెంబ్లీ వేడెక్కడం జరిగిందని తరువాత గుర్తించారు.
టేకాఫ్ సమయంలో ఈ సమస్య జరిగి ఉంటే తీవ్రమైన ప్రమాదానికి దారితీసి ఉండేదని అధికారులు తెలిపారు. జెడ్డా నుండి హజ్ యాత్రికులను తీసుకువచ్చిన ఈ విమానం సౌదీ అరేబియాకు ఖాళీగా తిరిగి వెళ్లాల్సి ఉంది.