పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వంట గ్యాస్ సరఫరాపై ఆందోళనలు పెరగడంతో దేశీయంగా ఇండక్షన్ స్టవ్లు, వాటికి సరిపడే పాత్రలకు (Utensils) డిమాండ్ అసాధారణంగా పెరిగింది. ఈ నేపథ్యంలో వీటి ఉత్పత్తిని వేగవంతం చేసేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పవర్ సెక్రటరీ, డీజీఎఫ్టీ (DGFT) సెక్రటరీ, డీపీఐఐటీ (DPIIT) సెక్రటరీ వంటి కీలక అధికారులు పాల్గొన్నారు. ఇండక్షన్ స్టవ్లు, కుక్కర్ల తయారీని భారీగా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం మార్కెట్లో ఇవి 'హాట్ కేక్స్'లా అమ్ముడవుతున్నాయని, డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు, అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు సానుకూల వృద్ధిని నమోదు చేశాయని అధికారులు వెల్లడించారు. వస్తువులు మరియు సేవల రంగాలు రెండూ పురోగతి సాధించాయని, దీనికి సంబంధించిన తుది గణాంకాలను ఏప్రిల్ 15న వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందని తెలిపారు. హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు అంతరాయం కలగడం వల్ల తలెత్తే ఇంధన కొరతను అధిగమించేందుకు విద్యుత్ ఆధారిత వంట పరికరాలను ప్రోత్సహించడం గమనార్హం.