మోదీ ప్రభుత్వం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోంది : ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై దాడి చేశారు.

By అంజి
Published on : 1 Jun 2025 7:13 AM IST

Government misled nation, Mallikarjun Kharge , top general, jets downed,

'ప్రభుత్వం దేశాన్ని తప్పుదారి పట్టించింది'.. టాప్ జనరల్ 'జెట్‌లు కూలిపోయాయి' వ్యాఖ్యలపై ఖర్గే

నాలుగు రాఫెల్‌లతో సహా ఆరు భారత విమానాలను పాకిస్థాన్ భద్రతా బలగాలు కూల్చివేసినట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అయితే.. ఆ వాదనను భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహాన్ తిరస్కరించారు. సిడిఎస్ అనిల్ చౌహాన్ పాకిస్తాన్ వాదనను తిరస్కరించి తన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ ప్ర‌క‌ట‌న‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో మోదీ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు.

సింగపూర్‌లో సీడీఎస్ చౌహాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తిందని, వాటిని అడగాల్సిన అవసరం ఉందని ఖర్గే అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిగినప్పుడే ఈ ప్రశ్నలన్నీ అడగొచ్చని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం దేశాన్ని తప్పుదోవ పట్టించిందని.. క్రమంగా ప్రతిదీ స్పష్టమవుతోందని అన్నారు. శత్రువులతో పోరాడుతున్నప్పుడు మన వైమానిక దళ సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు.. మ‌న‌ము కూడా కొన్ని నష్టాలను చవిచూశాము.. కానీ మన సైనికులు సురక్షితంగా ఉన్నారన్నారు.

సీడీఎస్ చౌహాన్ ఇంటర్వ్యూను ప్రస్తావిస్తూ.. అనిల్ చౌహాన్ ఇంటర్వ్యూ ప్రకారం పొరపాటును సరిదిద్దుకుని మళ్లీ అమలు చేశామని, రెండు రోజుల తర్వాత మా విమానాలను ఎగుర వేసి శత్రువుపై చాలా దూరం నుంచి దాడి చేశామని చెప్పారు. కార్గిల్ రివ్యూ కమిటీలా మొత్తం పరిస్థితిపై స్వతంత్ర నిపుణుల కమిటీ ద్వారా రక్షణ సన్నద్ధతపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఖర్గే డిమాండ్ చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌ళ్లీ కాల్పుల విరమణ పిలుపును పునరుద్ఘాటించారని, అలా జరిగితే అది సిమ్లా ఒప్పందాన్ని (1972) ఉల్లంఘించినట్లేనని మల్లికార్జన్ ఖర్గే అన్నారు. “ట్రంప్ ప్రకటనపై స్పష్టత ఇవ్వడానికి బదులుగా.. భారత ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని మోదీ మౌనం వహించారని ఖర్గే దుయ్య‌బ‌ట్టారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి పారదర్శకత లేదు. యుఎస్ వాణిజ్య కార్యదర్శి కూడా కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కాల్పుల విరమణను ధృవీకరించారన్నారు.

ప్ర‌స్తుతం ప్రధాని మోదీ ఎన్నికల స‌న్నాహాల‌లో బిజీగా ఉన్నారని, భద్రతా బలగాల ధైర్యసాహసాలకు వ్యక్తిగత క్రెడిట్‌ తీసుకుంటున్నారని, సైనికుల ధైర్యాన్ని దాచిపెడుతున్నారని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా వివరించకుండా తప్పించుకుంటున్నారని ఖర్గే అన్నారు.

Next Story