వెస్ట్బెంగాల్లో రెండు గూడ్స్ రైళ్లు ఢీ.. పట్టాలు తప్పిన 12 బోగీలు
పశ్చిమ బెంగాల్లోని బంకురా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 12 బోగీలు పట్టాలు తప్పాయి.
By అంజి Published on 25 Jun 2023 9:37 AM IST
వెస్ట్బెంగాల్లో రెండు గూడ్స్ రైళ్లు ఢీ.. పట్టాలు తప్పిన 12 బోగీలు
ఇటీవల కాలంలో వరుస రైలు ప్రమాదాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒకే పట్టాలపై వెళ్తున్న రెండు గూడ్స్ రైళ్లు ఢీ కొట్టుకున్నాయి. గూడ్స్ రైళ్లు కావడంతో ప్రాణనష్టం జరగలేదు. అయితే ఈ ప్రమాదంలోని ఓ గూడ్స్ రైలుకు చెందిన లోకో పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైళ్లలో ఒకటి వెనుక నుంచి మరొకటి ఢీకొనడంతో గూడ్స్ రైళ్లలోని 12 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఒండా స్టేషన్లో ఈ ఘటన జరిగింది.
అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒండా స్టేషన్ మీదుగా ఒకే ట్రాక్లో రెండు గూడ్సు రైళ్లు వెళ్లాయి. దీంతో సిబ్బంది ఒక రైలును లూప్లైన్ నిలిపివేయగా.. మరో గూడ్స్ రైలు.. నిలిపిఉంచిన రైలు ట్రాక్పైకే దూసుకొచ్చింది. దీంతో ఆగి ఉన్న గూడ్సును మరో రవాణా రైలు ఢీకొట్టింది. రైలు వేగంతో ఉండటంతో ఎదురుగా ఉన్న రైలు బోగీలపైకి ఎక్కేసింది. దీంతో 12 డబ్బాలు పట్టాలు తప్పాయి. ఆ టైంలో ఆ మార్గంలో మరో రైలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.
#WATCH | West Bengal: Two goods trains collided at Onda railway station in Bankura. Rail operation on Kharagpur–Bankura–Adra line has been halted. More details awaited. pic.twitter.com/T4sL5rn7Rp
— ANI (@ANI) June 25, 2023
రైల్వే అధికారుల ప్రకటన ప్రకారం.. రెండూ ఖాళీ గూడ్స్ రైళ్ల ప్రమాదానికి కారణం, రెండు రైళ్లు ఎలా ఢీకొన్నాయో ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. ఈ ప్రమాదంతో ఆద్రా డివిజన్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆద్రా డివిజన్ పశ్చిమ బెంగాల్లోని నాలుగు జిల్లాలకు సేవలు అందిస్తుంది. పశ్చిమ మిడ్నాపూర్, బంకురా, పురూలియా మరియు బుర్ద్వాన్, జార్ఖండ్లోని మూడు జిల్లాలు ధన్బాద్, బొకారో, సింగ్భూమ్. ఇది ఆగ్నేయ రైల్వే పరిధిలోకి వస్తుంది. పురూలియా ఎక్స్ప్రెస్ వంటి కొన్ని రైళ్లు ఈ సెక్షన్ నుండే వెళ్లాల్సి ఉంది. దీంతో వీలైనంత వేగంగా అప్లైన్ తెరవడానికి రైలు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ప్రెస్, మరో రెండు రైళ్లు ఢీకొన్న భయంకరమైన ట్రిపుల్ రైలు ప్రమాదంలో కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోయిన నెల తర్వాత ఈ సంఘటన జరిగింది.
ఒడిశా రైలు విషాదం
జూన్ 2న బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి. బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్, ఒక గూడ్స్ రైలు కోల్కతాకు దక్షిణాన 250 కి.మీ, భువనేశ్వర్కు 170 కి.మీ ఉత్తరాన బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. చెన్నై వైపు వెళ్తున్న షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్, పక్కనే ఉన్న ట్రాక్పై గూడ్స్ రైలును ఢీకొనడంతో పట్టాలు తప్పడంతో, కోరమాండల్ ఎక్స్ప్రెస్ వెనుక క్యారేజీ మూడో ట్రాక్పైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. మూడో ట్రాక్పై ఎదురుగా వస్తున్న బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన కోచ్లపైకి దూసుకెళ్లింది.