రైతులకు శుభవార్త.. ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
లోక్సబ ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 April 2024 8:30 AM IST
రైతులకు శుభవార్త.. ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
లోక్సభ ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు మోదీ సర్కార్ ప్రకటన చేసింది. విదేశాలకు లక్ష టన్నులకు పైగా ఉల్లి ఎగుమతులకు పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయంతో ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, బహ్రెయిన్, భూటాన్, మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఉల్లి ఎగుమతులపై ఇప్పటి వరకు ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు మోదీ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది.
అంతేకాదు.. మధ్య ఆసియా, ఐరోపా దేశౄలకు మరో 2వేల టన్నుల తెల్లరకం ఉల్లిని కూడా ఎగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిషేధం ఎత్తివేత 5 నెలల పాటు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా.. ఈ దేశాలకు ఉల్లిని ఎగుమతి చేసే ఏజెన్సీ నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ దేశీయ ఉత్పత్తులను చర్చల ప్రాతిపదికన 100 శాతం ముందస్తు చెల్లింపు రేటుతో ఎల్-1లో ఈ-ప్లాట్ఫామ్ ద్వారా సేకరించి, సరఫరా చేసిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక 2023-2024 ఖరీఫ్, రబీ పంట దిగుబడి తగ్గిపోయింది. దాంతో.. అంతర్జాతీయ మార్కెట్లో ఉల్లికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన కేంద్రం ఉల్లి ఎగుతులపై నిషేధం విధించింది. ఇక ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో రైతులకు ఊరట లభించింది. తమకు లాభాలు మరింత వస్తాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.