దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. అక్కడ ఆక్సిజన్, ఔషధాలు, పడకల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అప్రమత్తమైన భారత మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ నియోజకవర్గ ఎంపీ, బీజేపీ నేత గౌతమ్ గంభీర్ ఉచితంగా ఫ్యాబిఫ్లూ అనే యాంటీవైరల్ డ్రగ్ను పంపిణీ చేస్తున్నారు. ఈ డ్రగ్ను కొందరు వైద్యులు స్వల్ప నుంచి ఓ మోతాదు లక్షణాలున్న కరోనా బాధితుల చికిత్సలో వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో దీని కొరత భారీగా ఉంది. ఈ నేపథ్యంలో గంభీర్ దీన్ని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. తన నియోజకవర్గ ప్రజలు ఎంపీ కార్యాలయం నుంచి ఈ ఔషధం పొందాలని తెలిపారు. ఆధార్ కార్డు, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ చూపించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య దీన్ని పొందొచ్చన్నారు.
అయితే గంభీర్ చేస్తున్న పనిని కొందరు సామాజిక మాధ్యమాల్లో విమర్శించారు. కొందరు ఆప్ నేతలను టార్గెట్ చేసిన గంభీర్ ట్విట్టర్ లో ఘాటు రిప్లై ఇచ్చారు. కొందరి కారణంగానే ఢిల్లీలో ఆసుపత్రి బెడ్లను లక్షలకు అమ్ముకుంటూ ఉన్నారని.. రెమ్దెసివిర్ మందులను కూడా వేల రూపాయల్లో అమ్ముకుంటూ ఉన్నారని.. అలాంటి వాళ్లు తనను ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. తాను పేదలకు మందులు ఇవ్వడం కూడా కొందరికి నచ్చడం లేదని తనదైన శైలిలో గంభీర్ సమాధానం చెప్పారు.