జైల్లో గుండెపోటుతో గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్‌ మృతి, యూపీలో అలర్ట్

ఉత్తర్ ప్రదేశ్‌లోని బందా జైల్లో గ్యాంగ్‌స్టర్, సమాజ్‌వాదీ పార్టీ నేత ముఖ్తార్‌ అన్సారీ (63) గుండెపోటుతో చనిపోయాడు.

By Srikanth Gundamalla  Published on  29 March 2024 2:53 AM GMT
gangster ansari, death,  heart attack,  jail,

జైల్లో గుండెపోటుతో గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్‌ మృతి, యూపీలో అలర్ట్

ఉత్తర్ ప్రదేశ్‌లోని బందా జైల్లో గ్యాంగ్‌స్టర్, సమాజ్‌వాదీ పార్టీ నేత ముఖ్తార్‌ అన్సారీ (63) గుండెపోటుతో చనిపోయాడు. గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ముఖ్తార్‌ అన్సారీ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసులో దోషిగా తేలడంతో అన్సారీ 2005 నుంచి జైల్లోనే ఉన్నాడు. అన్సారీ మృతిపై వైద్యులు మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. గురువారం రాత్రి 8.25 గంటల సమయంలో అస్వస్థతకు గురయ్యాడని పేర్కొన్నారు. వాంతులు చేసుకున్నాక అపస్మారక స్థితికి వెళ్లాడని తెలిపారు. దాంతో.. జైలు అధికారులు ఆయన్ని చికిత్స కోసం దుర్గావతి మెడికల్ కాలేజ్‌ ఆస్పత్రికి తరలించగా.. తొమ్మిది మంది వైద్యుల బృందం చికిత్స ప్రారంభించింది. కానీ.. చికిత్స అందిస్తున్న క్రమంలోనే అన్సారీ గుండెపోటుతో చనిపోయారనీ వైద్యులు తెలిపారు.

ఇక అన్సారీ మరణంపై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఆయనపై జైలులో విషప్రయోగం చేశారనీ అన్సారీ సోదరుడు, ఘాజీపూర్‌ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. బందా జైల్‌ సిబ్బంది స్లో పాయిజనింగ్ చేసి చంపేశారంటూ ఆరోపిస్తున్నారు. దాంతో.. అన్సారీ మృతితో ఆస్పత్రి పరిసరాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్తర్‌ ప్రదేశ్‌లో 144 సెక్షన్‌ విధించారు. బందా, ఘాజీపూర్, వారణాసి జిల్లాల్లో పోలీసులు, అదనపు బలగాలు మోహరించాయనీ రాష్ట్ర డీజీపీ ప్రశాంత్‌ కుమార్ తెలిపారు.

యూపీలోని మౌకు చెందిన ముఖ్తార్ అన్సారీపై 61 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో 15 కేసులు హత్యలకు సంబంధించినవే. 1980లో నేరాలు మొదలుపెట్టిన అన్సారీ.. 90వ దశకంలో సొంతంగా ముఠాను ఏర్పాటు చేశాడు. మౌ, ఘాజీపూర్, వారణాసి ప్రాంతాల్లో ఇతని ముఠాలు దోపిడీలు, కిడ్నాప్‌లు వంటి దారుణాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా.. 2004లో అన్సారీ వద్ద మెషిన్ గన్‌ను గుర్తించారు పోలీసులు. దాంతో.. అతన్ని ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అప్పుడే జైలుకు పంపారు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ హత్య కేసులో 2023 ఏప్రిల్‌లో న్యాయస్థానం అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్‌ కలిగి ఉన్నారన్న అభియోగాలు రుజువుకావడంతో మార్చి 13న కోర్టు జీవితఖైదును ఖరారు చేసింది.

కాగా.. అన్సారీ ఐదు సార్లు మౌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యాడు. రెండు సార్లు బీఎస్పీ తరఫున పోటీ చేశాడు. అన్సారీ మృతిపై సమాజ్‌వాదీ పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఈ మేరకు పార్టీ తెలిపింది.


Next Story