పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. 5 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాను పెంచిన కేంద్రం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి.

By -  అంజి
Published on : 13 April 2026 7:57 AM IST

5kg LPG Cylinders, Fuel Supply Disruption, PNG Connections, West Asia Conflict Impact, Energy Import Crisis

పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. 5 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాను పెంచిన కేంద్రం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. భారతదేశం తన అవసరాలకు కావాల్సిన ముడి చమురులో సగానికి పైగా, గ్యాస్‌లో 40 శాతం, ఎల్‌పీజీలో దాదాపు 85-90 శాతం వరకు ఆ ప్రాంతం నుంచే దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం ఆరు వారాలు దాటడంతో దిగుమతులపై ప్రభావం పడి, దేశీయంగా ఎల్‌పీజీ సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో ఇంధన లభ్యతను సమన్వయం చేసేందుకు ప్రభుత్వం 5 కిలోల చిన్న సిలిండర్ల సరఫరాను భారీగా పెంచింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి 23 నుంచి ఇప్పటివరకు 13 లక్షలకు పైగా 5 కిలోల సిలిండర్లు విక్రయించబడ్డాయి. ఫిబ్రవరిలో రోజుకు కేవలం 77,000గా ఉన్న అమ్మకాలు, ప్రస్తుతం లక్ష యూనిట్లను అధిగమించాయి. ముఖ్యంగా వలస కార్మికులు, తక్కువ ఆదాయ వర్గాల ప్రజలు మార్కెట్ ధరకే లభించే ఈ చిన్న సిలిండర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రభుత్వం గృహ వినియోగదారులకు ప్రాధాన్యతనిస్తూ, హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య విభాగాలకు సరఫరాలో కోతలు విధించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతోంది.

మరోవైపు, వంట గ్యాస్ కోసం పైప్డ్ సహజ వాయువు (PNG) వినియోగాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మార్చి నెల నుంచి ఇప్పటివరకు సుమారు 4,24,000 కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను యాక్టివేట్ చేశారు. ఈ మార్పులో భాగంగా దాదాపు 30,000 మంది వినియోగదారులు తమ ఎల్‌పీజీ కనెక్షన్లను స్వచ్ఛందంగా సరెండర్ చేయడం విశేషం. ఇంధన దిగుమతుల కోసం ఇతర ప్రాంతాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ప్రస్తుతానికి పీఎన్‌జీ మరియు చిన్న సిలిండర్ల ద్వారానే లోటును భర్తీ చేస్తున్నారు.

Next Story