కరోనాతో మాజీ అటార్నీ జనరల్ కన్నుమూత
Former attorney general Soli sorabjee Pass away.కరోనాతో మాజీ అటార్నీ జనరల్ కన్నుమూత
By తోట వంశీ కుమార్
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అన్న తేడాలేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మాజీ అటార్నీ జనరల్, పద్మవిభూషణ్ సోలీ సొరాబ్జీ కరోనాతో కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకగా.. న్యూ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు.
సోలీ సొరాబ్జీ మృతి విషయాన్ని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సంతాపాన్ని వెలిబుచ్చారు. 1930లో ముంబైలో జన్మించిన సోలీ సొరాబ్జీ.. 1953లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 1971లో సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్గా గుర్తించింది. తర్వాత కొంతకాలానికి ఆయన అటార్జీ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. మొదటిసారి 1989-90, రెండోసారి 1998-2004 వరకు ఏజీఐగా వ్యవహరించారు.
సోరాబ్జీ మానవ హక్కులపై విశేష కృషి చేశారు. 1997లో నైజీరియాలో మానవ హక్కుల పరిస్థితిపై అధ్యయనం కోసం ఐరాస(ఐక్య రాజ్య సమితి) ఆయనను ప్రతినిధిగా పంపింది. అనంతరం ఐరాస ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉప సంఘానికి చైర్మన్గా వ్యవహరించారు.