దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలో సోమవారం రద్దీగా ఉండే లోకల్ రైలు నుంచి పడి ఐదుగురు మరణించారని రైల్వే అధికారులు తెలిపారు. పుష్పక్ ఎక్స్ప్రెస్, కసారా లోకల్ ఒకదానికొకటి దాటుతున్నప్పుడు ముంబ్రా, దివా రైల్వే స్టేషన్ల మధ్య ఈ సంఘటన జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుండి థానేలోని కసారా ప్రాంతం వైపు వెళ్తున్న లోకల్ రైలులో భారీ రద్దీ కారణంగా కొంతమంది జారీ పట్టాలపై పడిపోయారు. కనీసం 10 నుండి 12 మంది ప్రయాణికులు రైలు నుండి పడిపోయినట్లు సమాచారం. దీంతో ఐదుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రైలు లోపల రద్దీ ఎక్కువగా ఉండటం వల్లే ప్రజలు కంపార్ట్మెంట్ నుండి పడిపోయారని అధికారులు భావిస్తున్నారు. నివేదికల ప్రకారం, ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తలుపులకు వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది.