శ్మశానంలో అంగరంగ వైభవంగా ప్రేమ జంట పెళ్లి.. ఎక్కడంటే?

చావు డప్పులు మోగే స్థలంలో.. మంగళవాయిద్యాలు మోగాయి. శ్మశానంలోనే పెద్దల సమక్షంలో ఓ ప్రేమ జంట వివాహం చేసుకుంది.

By అంజి  Published on  28 July 2023 4:31 AM GMT
wedding ceremony, cemetery, ahmednagar

శ్మశానంలో అంగరంగ వైభవంగా ప్రేమ జంట పెళ్లి.. ఎక్కడంటే?

చావు డప్పులు మోగే స్థలంలో.. మంగళవాయిద్యాలు మోగాయి. శ్మశానంలోనే పెద్దల సమక్షంలో ఓ ప్రేమ జంట వివాహం చేసుకుంది. మహారాష్ట్రలో ఈ అరుదైన పెళ్లి జరిగింది. వివరాల్లోకి వెళితే.. అహ్మద్‌నగర్ జిల్లా శిర్డీ సమీపంలోని రహతా గ్రామానికి చెందిన గంగాధర్‌ది మహాసంజోగీ సామాజిక వర్గం. ఈయన స్థానికంగా ఉన్న శ్మశాన వాటికలో కొన్నేళ్లుగా కాటికాపరిగా పనిచేస్తున్నారు. తన కుటుంబంతో కలిసి శ్మశానంలోనే కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. ఈయనకు మయూరి అనే ఓ కూతురు ఉంది. ఆమె కూడా శ్మశానంలోనే పుట్టి పెరిగింది.

ఇంటర్ వరకు చదువుకున్న మయూరి, మనోజ్ అనే అబ్బాయితో ప్రేమలో పడింది. రెండు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకారం తెలిపాయి. అయితే మయూరి తండ్రి గంగాధర్ మాత్రం తన కూతురు పుట్టి పెరిగిన చోటే పెళ్లి చేయాలని అని కోరారు. దీనికి మనోజ్ పేరెంట్స్ కూడా అంగీకారం తెలపడంతో పెళ్లి బంధువులు, స్నేహితుల సమక్షంలో శ్మశానంలోనే అంగరంగవైభవంగా జరిగింది. హిందువులు శ్మశానవాటికను పవిత్రమైనదిగా పరిగణించరు. అందుకే ఆ ప్రదేశంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.

కానీ, అహ్మదాబాద్‎కు చెందిన గంగాధర్ గైక్వాడ్ తన కుమార్తె వివాహాన్ని శ్మశానంలో చేశారు. వివాహ సమయంలో నిర్వహించే అన్ని సంప్రదాయ ఆచారాలను శ్మశానంలోనే పాటించారు. తన కోరికను నెరవేర్చుకున్నారు. సంగీత్, బారాత్ వేడుకల నిర్వహించారు. ఈ వివాహానికి గ్రామస్థులు కూడా తమవంతు సహకారం అందించారు. నగర మాజీ మేయర్లు, ఇతర నాయకులు ఈ వివాహ వేడుకలో పాల్గొని నవదంపతులను ఆశీర్వదించారు. మూఢనమ్మకాలను పారద్రోలేందుకు ఈ వివాహం ఓ ఉదాహరణగా నిలిచింది.

Next Story