మరోసారి నిరసనలకు దిగుతున్న రైతులు, ఫిబ్రవరి 26 నుంచి..

రైతులు మరోసారి నిరసనలు తెలిపేందుకు సిద్ధం అవుతున్నారు. యునైటెడ్ కిసాన్ మోర్చా గురువారం సమావేశం నిర్వహించింది.

By Srikanth Gundamalla  Published on  23 Feb 2024 2:59 AM GMT
Farmers, protest, kisan morcha,

మరోసారి నిరసనలకు దిగుతున్న రైతులు, ఫిబ్రవరి 26 నుంచి..

దేశంలో పంజాబ్, హర్యానా రైతుల డిమాండ్లు ఇంకా నెరవేరలేదు. ఈ నేపథ్యంలోనే రైతులు మరోసారి నిరసనలు తెలిపేందుకు సిద్ధం అవుతున్నారు. యునైటెడ్ కిసాన్ మోర్చా గురువారం సమావేశం నిర్వహించింది. ఇందులో కీలక నిర్ణయాలను తీసుకున్నారు రైతు నేతలు. ఫిబ్రవరి 26న హైవేకి ఒక వైపు ట్రాక్టర్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. మార్చి 14న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్న డబ్ల్యూటీవో సమావేవానికి కూడా వ్యతిరేకంగా నిరసనలను తెలపనున్నట్లు కిసాన్ మోర్చా నేతలు తెలిపారు.

ఇక రైతు నాయకుడు రాజేవాల్‌ మాట్లాడుతూ.. పంజాబ్-హర్యానా సరిహద్దులో ఓ యువకుడి బలిదానం గురించి ప్రస్తావించారు. ఈ ఘటనకు నిరసనగా హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిష్టి బొమ్మలను దేశవ్యాప్తంగా దహనం చేస్తామని చెప్పారు. హర్యానా పోలీసులు తమ ప్రాంతానికి వచ్చి ట్రాక్టర్లను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హర్యానా హోంమంత్రిపై సెక్షన్‌ 302 కింద కేసు నమోదు చేయాలని డిఆండ్ చేశారు. హర్యానా సీఎం, కేంద్ర హోంమంత్రులు రాజీనామా చేయాలని రాజేవాల్ డిమాండ్ చేశారు.

ఎస్‌కేఎంతో ఉన్న పాత రైతుసంఘాల మధ్య ఐక్యతను పెంచేందుకు కృషి చేస్తామని రాజేవాల్ చెప్పారు. అంతేకాక .. పంజాబ్-హర్యానా సరిహద్దులో హత్యకు గురైన యువకులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కిసాన్‌ మోర్చా డిమాండ్ చేసింది. హనన్‌ మౌలా, ఉగ్ర, రమీంద్ర పాటియాలా, దర్శన్‌పాల్‌, రాజేవాల్‌లతో కూడిన ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కిసాన్ మోర్చా తెలిపింది.

Next Story