బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ కేసులో పలువురు ప్రముఖులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, నటులు సోనూసూద్, నేహాశర్మ, ఊర్వశీ రౌటెలా, టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, బెంగాళీ నటుడు అంకుశ్ హజ్రా ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అటాచ్ చేసిన రూ.7.93 కోట్లతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.19.7 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. జప్తు చేసిన వాటిలో యువరాజ్ సింగ్ రూ.2.5 కోట్లు, రాబిన్ ఉతప్ప రూ.8.6 లక్షలు, సోను సూద్ రూ.1 కోటి, మిమి చక్రవర్తి రూ.59 లక్షలు, అంకుష్ హజ్రా రూ.47.20 లక్షలు, నేహా శర్మ రూ.1.26 కోట్ల, ఊర్వశి రౌతేలా (ఆమె తల్లి పేరు మీద ఉన్న) రూ.2.02 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో గతంలో క్రికెటర్లు శిఖర్ ధావన్కు సంబంధించిన రూ.4.55 కోట్లు, సురేష్ రైనాకు చెందిన రూ.6.64 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రముఖులందరినీ గతంలో ఈడీ పలుమార్లు విచారించింది.