భారతదేశంలో కరోనాతో ఎంతో మంది చనిపోతూ ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల మృతదేహాలను కాల్చడానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. భారీగా ధరలను పెంచేయడం.. మృతదేహాలను ఖననం చేయడానికి కనీసం స్థలం కూడా లేకపోవడం వంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇప్పుడు నదుల్లో కరోనాతో చనిపోయిన వారిని పారేస్తూ ఉన్నారనే వార్తలు టెన్షన్ పెడుతున్నాయి. డజనుకుపైగా మృతదేహాలు యమునా నదిలో తేలియాడుతూ కనిపించడం ఆందోళనకు గురిచేశాయి. యమునా నదిని పవిత్రంగా భావించి సాధారణంగా మృతదేహాలను నదుల్లో పడవేస్తూ ఉంటారు. ఒకట్రెండు మృతదేహాలు నదిలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయట.. కానీ, ఇప్పుడు ఏకంగా పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపిస్తూ ఉండడం ప్రతి ఒక్కరినీ టెన్షన్ పెడుతూ ఉంది.
ఉత్తరప్రదేశ్ లోని హామీర్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను నదిలో పడేశారని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలో కరోనాతో చాలా మంది చనిపోతున్నారని, వారి అంత్యక్రియలకు శ్మశానం సరిపోవట్లేదని, దీంతో శవాలను ఇలా నదిలో పడేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక అధికారులు వచ్చి నదిలో ఉన్న శవాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో యమునా నది ఒడ్డునే కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. హామీర్ పూర్ నుంచి కాన్పూర్ జిల్లాల వరకు రోజూ లెక్కకు మించిన మరణాలు నమోదవుతున్నాయని, కానీ, పట్టించుకునేవారు లేరని ఆయా జిల్లాల గ్రామస్థులు వాపోతున్నారు. యమునా నది పవిత్రమైనదిగా స్థానికులు భావిస్తుంటారని, అందుకే నదిలో మృతదేహాలను ఖననం చేస్తుండవచ్చని హామీర్ పూర్ ఏఎస్పీ అనూప్ కుమార్ సింగ్ చెప్పారు.