రూ.600 కోట్ల ఆస్తిని పేదలకు దానం చేసిన డాక్టర్‌ అరవింద్

Doctor Arvind Goyal donates Rs 600 cr worth property to UP Govt. డాక్టర్ అరవింద్ గోయల్ అనే మెడికల్ ప్రాక్టీషనర్ పేదలకు సహాయం చేయడానికి తన మొత్తం ఆస్తిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు.

By అంజి  Published on  21 July 2022 7:08 AM GMT
రూ.600 కోట్ల ఆస్తిని పేదలకు దానం చేసిన డాక్టర్‌ అరవింద్

ప్రతి ఒక్కరూ సమాజం, పేదల సంక్షేమం గురించి మాట్లాడతారు, వారంతా పేదలకు సాయం చేయలేరు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన డాక్టర్ అరవింద్ గోయల్ అనే మెడికల్ ప్రాక్టీషనర్ పేదలకు సహాయం చేయడానికి తన మొత్తం ఆస్తిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఆయన ఆస్తి మొత్తం విలువ దాదాపు రూ.600 కోట్లు. అతను గత 50 సంవత్సరాలుగా డాక్టర్‌గా పని చేస్తున్నాడు. డాక్టర్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ.. తాను 25 ఏళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

లాక్‌డౌన్ సమయంలో మొరాదాబాద్‌లోని 50 గ్రామాలను దత్తత తీసుకుని గోయల్ ప్రజలకు ఉచిత సౌకర్యాలు కల్పించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని పేదలకు ఉచిత విద్య, మెరుగైన వైద్యం కూడా ఆయన ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా దేవి పాటిల్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సహా నాలుగుసార్లు రాష్ట్రపతి చేతుల మీదుగా గోయల్‌ సత్కరించబడ్డాడు. అరవింద్‌ గోయల్‌కు భార్య రేణు గోయల్‌తో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొరాదాబాద్ సివిల్ లైన్స్‌లో ఉన్న ఒక బంగ్లాను మాత్రమే అరవింద్‌ తన వద్ద ఉంచుకున్నాడు. అతను ఈ బంగ్లాలోనే ఉంటున్నాడు. అతని భార్య, కొడుకు, కూతురు ఇద్దరూ కూడా ఈ నిర్ణయంతో ఆయనతో ఏకీభవించారు.

25 ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నారు

ఇన్ని సంవత్సరాల సంపాదన ఇలా దానం చేయడం చిన్న విషయం కాదు. ఈ చర్య ఎందుకు తీసుకున్నారనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అరవింద్ గోయల్ మాట్లాడుతూ.. 25 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన తర్వాత ఏదో ఒక రోజు తన సంపద మొత్తాన్ని పేదలకు దానం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ.. అది డిసెంబర్ నెల అని, తాను రైలులో ప్రయాణిస్తున్నానని చెప్పాడు. అప్పుడు అతని కళ్ళు చలికి వణుకుతున్న వ్యక్తిపై పడ్డాయి, అతని కాళ్ళకు దుప్పటి లేదా చెప్పులు లేవు. అతని పరిస్థితి చూసి అరవింద్ చెప్పులు ఇచ్చాడు. ఈ ఘటన తర్వాత దేశంలో ఎంత మంది ఇలా చెప్పులు లేకుండా బతుకుతారో తెలియదని అరవింద్ అనుకున్నాడు. ఆ తర్వాత పేదల కోసం పని చేస్తానని నిర్ణయించుకున్నాడు.

అరవింద్ కుటుంబ నేపథ్యం

అరవింద్‌కు భార్య రేణు గోయల్, పెద్ద కుమారుడు మధుర్ గోయల్, చిన్న కుమారుడు శుభం ప్రకాష్ గోయల్, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కొడుకు ముంబైలో ఉంటాడు. చిన్న కొడుకు మొరాదాబాద్‌లో అతనితో వ్యాపారంలో సహాయం చేస్తున్నాడు. అరవింద్ గోయల్ తండ్రి ప్రమోద్ కుమార్ గోయల్, తల్లి శుక్తలా దేవి స్వాతంత్ర్య సమరయోధులు. వీరే కాకుండా ఆయన బావమరిది ప్రధాన ఎన్నికల కమిషనర్‌గానూ, అల్లుడు కల్నల్‌గానూ, మామ సైన్యంలో న్యాయమూర్తిగా ఉన్నారు.

అరవింద్‌ను నలుగురు అధ్యక్షులు సత్కరించారు

అరవింద్ గోయల్‌కు ప్రస్తుతం అనేక పాఠశాలలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ఉచిత ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. పాఠశాలల్లో పేదలకు ఉచిత విద్య అందజేస్తున్నారు. ఇది కాకుండా, కరోనా కాలంలో, అతను 50 గ్రామాలను కూడా దత్తత తీసుకున్నాడు. ప్రజలకు ఉచితంగా ఆహారం, మందులు అందించాడు. సమాజం కోసం చేసిన ఈ పనులకు గాను గోయల్‌ను నలుగురు రాష్ట్రపతులు సత్కరించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా దేవి సింగ్ పాటిల్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఆయన్ను సత్కరించారు.

ఐదుగురు సభ్యుల కమిటీ ఆస్తిని పర్యవేక్షిస్తుంది

డాక్టర్ గోయల్ ఆస్తిని సరైన ధరకు విక్రయించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో గోయల్ ముగ్గురు సభ్యులను నామినేట్ చేయగా, ప్రభుత్వం ఇద్దరు సభ్యులను నామినేట్ చేస్తుంది. ఆస్తులు అమ్మి వచ్చిన డబ్బుతో అనాథలు, నిరుపేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు.

Next Story