ఢిల్లీలో ఖలిస్తాన్ నినాదాల రాతలు, హైఅలర్ట్

దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థాన్‌ అనుకూల నినాదాలు కలకలం రేపుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  27 Aug 2023 10:47 AM GMT
Delhi, Metro Stations, Khalistan slogans,

ఢిల్లీలో ఖలిస్తాన్ నినాదాల రాతల కలకలం, హైఅలర్ట్

దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థాన్‌ అనుకూల నినాదాలు కలకలం రేపుతున్నాయి. మెట్రో స్టేషన్లపై పలు చోట్ల ఖలిస్తాన్‌ పేరుతో నలుపు రంగుతో రాతలు రాశారు. తీవ్రవాదులు ఢిల్లీలో ఉన్నారా అనే ప్రశ్న ఢిల్లీ ప్రజల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌జే సంస్థలోకి వీడియోను కూడా విడుదల చేసింది. మెట్రో అధికారులు ఖలిస్తాన్ రాతలను గుర్తించి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. మెట్రో స్టేషన్ల ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

ఢిల్లీని ఖలిస్థాన్ గా మారుస్తామని, పంజాబ్ భారత దేశానికి చెందినది కాదంటూ దుండగులు మెట్రో స్టేషన్ల గోడలపై రాశారు. భారతదేశం సిక్కుల నరమేధానికి పాల్పడిందని, ఖలిస్థాన్ రెఫరెండం జిందాబాద్ అని SFJ పేరుతో నినాదాలను రాశారు. కాగా.. నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ కార్యకర్తల పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలోని శివాజీ పార్క్‌ నుంచి పాజంఆబీ బాగ్‌ వరకూ పలు మెట్రో స్టేషన్లపై ఇలాంటి రాతలు కలకలం రేపుతున్నాయి. దీనిపై స్పెషల్‌ సెల్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారని.. నిందితులను త్వరలోనే గుర్తిస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. వారిని పట్టుకుని చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఖలిస్తాన్ అనుకూల నినాదాలతో ఉన్న రాతలను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సీసీఫుటేజ్‌ అన్నింటినీ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాలను నిందితులు తప్పించుకోలేరని.. అతి త్వరలోనే గుర్తిస్తామని డీసీపీ చెప్పారు. కాగా.. ఇండియాలో రానున్న కొద్ది రోజుల్లోనే జీ20 సదస్సు నిర్వహించనుంది. ఈ క్రమంలో ఖలిస్తానీ రాతలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలో ఆయా చోట్ల భద్రతను మరింత పెంచామని.. గాలింపు చర్యల ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

Next Story