ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సిబిఐ దాఖలు చేసిన అప్పీలును ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ట్రయల్ కోర్టు తీర్పులో సీబీఐపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కవితలతో సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.
ఫిబ్రవరి 27న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిస్తూ.. సిబిఐ రిపోర్ట్ "నిరూపించలేని తప్పులతో కూడుకున్నదని, ఆర్థిక అక్షరాస్యత లేనిదని, చట్టపరంగా నిలబడలేనిదని" తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. సిబిఐ సమర్పించిన ఆధారాలు సరిపోవని ట్రయల్ కోర్టు పేర్కొన్నప్పటికీ, ఆ సంస్థ పనితీరుపై చేసిన ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని హైకోర్టు భావించింది.
అయితే కేజ్రీవాల్, సిసోడియా, ఇతర 21 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం మార్చి 16వ తేదీని ఖరారు చేసింది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ మేరకు కేజ్రీవాల్, సిసోడియాలతో పాఉ నోటీసులు జారీ చేస్తూ స్పందన కోరారు. విచారణ సందర్భంగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న సంబంధిత మనీలాండరింగ్ కేసులో విచారణలను వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు సూచించింది.