ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ, తీహార్‌ జైలుకు తరలింపు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

By Srikanth Gundamalla  Published on  1 April 2024 9:02 AM GMT
delhi, cm arvind kejriwal, judicial remand, ed,

  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ, తీహార్‌ జైలుకు తరలింపు 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి చుక్కెదురు అయ్యింది. ఈ కేసులో కేజ్రీవాల్‌ కస్టడీ ముగియడంతో ఆయన్ని అధికారులు కోర్టు ముందు హాజరుపర్చారు. ఈ క్రమంలో విచారణ జరిపిన న్యాయస్థానం 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అధికారులు తీహార్‌ జైలుకు తరలించనున్నారు.

మార్చి 21వ తేదీన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు సోదాలు కూడా చేశారు. ఇక అరెస్ట్‌ తర్వాత ఈడీ కస్టడీకి కేజ్రీవాల్‌ను కోర్టు అనుమతి ఇచ్చింది. తొలుతు ఏడు రోజులు, ఆ తర్వాత నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది ప్రత్యేక కోర్టు. ఆ తర్వాత తాజాగా ఆయన కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరు పరిచారు అధికారులు. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. ఈడీ కస్టడీ పొడిగింపు కోరడం లేదని తెలిపారు. దాంతో.. న్యాయస్థానం జ్యుడిషియల్ కస్డడీకి అప్పగించాలని కోరారు.

ఈ సందర్భంగా కోర్టులో పలు వాదనలు జరిగాయి. విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని.. ప్రజలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వడం లేదని ఈడీ దర్యాప్తు సంస్థ తరఫు లాయర్ కోర్టుకు వినిపించారు. దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఉద్దేశపూర్వకంగానే కేజ్రీవాల్ డిజిటల్ పరికరాల పాస్‌వర్డ్‌లను కూడా చెప్పట్లేదని అన్నారు. కొద్ది రోజుల దాకా మళ్లీ కస్టడీలోకి తీసుకుంటామనీ.. అప్పటిదాకా జ్యుడిషియల్ కస్టడీ విధించాలని ఈడీ తరఫు లాయర్ చెప్పారు. దీనికి అంగీకరించిన న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.

Next Story