వాలెంటైన్స్‌ డే రోజు విషాదం.. సముద్రంలో మునిగి జంట మృతి

Couple go to Goa to ring in Valentine's Day, drown in Goa Beach. ప్రేమికుల దినోత్సవం రోజున విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులకు

By అంజి  Published on  15 Feb 2023 3:52 AM GMT
వాలెంటైన్స్‌ డే రోజు విషాదం.. సముద్రంలో మునిగి జంట మృతి

ప్రేమికుల దినోత్సవం రోజున విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి గోవా వెళ్లిన జంట మంగళవారం సాయంత్రం పలోలెం బీచ్‌లో మునిగిపోయారు. మృతులను సుప్రియా దూబే (26), విభు శర్మ (27)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లైఫ్‌గార్డుల సహాయంతో మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. పోలీసులు వారిద్దరినీ కొంకణ్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వారు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాలను శవపరీక్షకు పంపించారు.

కొంకణ్ పోలీసుల కథనం ప్రకారం.. సుప్రియ, విభు ఇద్దరూ ఉత్తరప్రదేశ్ నివాసితులు. వారు సెలవుల కోసం గోవా వచ్చారు. పని నిమిత్తం సుప్రియ బెంగళూరులో నివసిస్తుండగా, విభు ఢిల్లీలో ఉంటున్నాడు. సుప్రియ, విభు బంధువులని, వారు గోవాలో ఉన్నారని వారి కుటుంబాలకు తెలియదని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ గత రెండు రోజులు క్రితం గోవాకు విహారయాత్ర కోసం వచ్చారు. సోమవారం రాత్రి పాలోలెం బీచ్‌లో సరదాగా తిరిగారు. మంగళవారం సాయంత్రం కూడా బీచ్‌కు వచ్చి జలకాలాడుతూ ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.

Next Story