క‌రోనా3.0, 4.0 కూడా ఉన్నాయి..

Corona third and fourth wave likely in future.కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెండో వేవ్ మాత్ర‌మే కాకుండా.. మూడు, నాలుగు ద‌శ‌లు ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2021 7:39 AM GMT
corona wave

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఉగ్ర‌రూపం దాల్చింది. తొలి వేవ్ తో పోలిచ్చే రెండో వేవ్‌లో భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. రోజువారి కేసుల సంఖ్య ల‌క్ష‌ల్లో ఉండ‌గా.. మ‌ర‌ణాలు వేల సంఖ్య‌లో న‌మోదుఅవుతున్నాయి. దేశంలో మార్చి నెలలో ప్రారంభమైన సెకండ్‌ వేవ్‌ విజృంభణ.. మే మధ్యలో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని భారతీయ అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ ఆర్థికవేత్తల నివేదిక వెల్లడించింది. అలా కొనసాగుతూ మే చివరి నాటికి వైరస్‌ తీవ్రత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

హ‌మ్మ‌య్యా.. మ‌రో నెల రోజుల పాటు జాగ్ర‌త్త‌గా ఉంటే చాలని ఇక క‌రోనా బెంగ తొల‌గిన‌ట్లేన‌ని భావిస్తున్న స‌మ‌యంలో కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెండో వేవ్ మాత్ర‌మే కాకుండా.. మూడు, నాలుగు ద‌శ‌లు ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. వాటిని ఎదుర్కొనేందుకు దేశ ప్ర‌జ‌లు సిద్దంగా ఉండాల‌ని సూచించారు. ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌కుండా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌న్నారు. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు.

ఇదిలా ఉంటే.. గ‌డిచిన 24 గంట‌ల్లో 17,68,190 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 3,79,257 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,83,76,524కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,645 మంది క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. భార‌త్‌లో ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,04,832కి పెరిగింది. నిన్న 2,69,507 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,50,86,878కి చేరింది. రిక‌వ‌రీ రేటు 82.33 శాతం ఉండ‌గా.. మ‌ర‌ణాల రేటు 1.12 శాతంగా ఉంది. ప్ర‌స్తుతం దేశంలో 30,84,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక టీకాల విష‌యానికి వ‌స్తే.. టీకాలు పొందిన వారి సంఖ్య 15 కోట్లు దాటింది.




Next Story