సీఎం సభా వేదికపైకి దూసుకెళ్లేందుకు యువకుడి యత్నం

బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ సభలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  15 Aug 2023 10:43 AM GMT
CM Nitish,  man try to run,  stage, bihar,

 సీఎం సభా వేదికపైకి దూసుకెళ్లేందుకు యువకుడి యత్నం

బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ సభలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రసంగిస్తుండగా సభ స్టేజ్‌పై వెళ్లేందుకు ప్రయత్నించాడు. అనూహ్యంగా జనాల్లో నుంచి పోస్టర్‌ పట్టుకుని పరుగెత్తుకు వచ్చాడు. అలర్ట్‌ అయ్యిన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. ఊహించిన విధంగా జరిగిన ఈ ఘటనతో అందరూ ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

బీహార్‌ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత సీఎం నితీశ్‌ కుమార్.. అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంతలోనే యువకుడు చేతిలో పోస్టర్‌ పట్టుకుని వేదిక వైపు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. తనకు ప్రభుత్వ ఉద్యోగం కావాలంటూ సదురు యువకుడు రాసుకొచ్చాడు. ఊహించని పరిణామంతో భద్రతా సిబ్బంది అలర్ట్‌ అయ్యారు. అతన్ని అడ్డుకున్నారు. అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు.

సభ అనంతరం.. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ యువకుడు ముంగేర్‌ జిల్లాకు చెందిన నితీశ్‌ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతడి తండ్రి రాజేశ్వర్‌ పాసవాన్‌. బీహార్‌ మిలిటరీ పోలీసు విభాగంలో పనిచేస్తూ కొన్నేళ్ల క్రితం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. దాంతో.. కారుణ్య నియామకం కింద తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ యువకుడు డిమాండ్‌ చేశాడు. ఉద్యోగం అడగాలనే ఉద్దేశంతోనే తాను సీఎం సభా వేదిక వద్ద అలా వ్యవహరించినట్లు చెప్పాడు. కాగా.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు జిల్లా మెజిస్ట్రేట్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ వెల్లడించారు.

Next Story