పెట్రోల్ బంకుల ద్వారా కిరోసిన్ పంపిణీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఇంధన సరఫరాలో తలెత్తిన అంతరాయాలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By - అంజి |
పెట్రోల్ బంకుల ద్వారా కిరోసిన్ పంపిణీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఇంధన సరఫరాలో తలెత్తిన అంతరాయాలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిరోసిన్ పంపిణీని మరింత సులభతరం చేసేలా పెట్రోలియం భద్రత, లైసెన్సింగ్ నిబంధనలను సడలించింది. దీని ప్రకారం, ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల ద్వారా పరిమిత కాలం పాటు కిరోసిన్ విక్రయించడానికి అనుమతిస్తూ మార్చి 29న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
గతంలో కిరోసిన్ సరఫరా నిలిపివేసిన ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా 21 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) కింద సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ (SKO) కేటాయించేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ సవరించిన నిబంధనల ప్రకారం, గృహ అవసరాల కోసం (వంట మరియు వెలుతురు) కిరోసిన్ను నిల్వ చేయడానికి మరియు విక్రయించడానికి కొన్ని పెట్రోల్ బంకులకు అధికారం ఉంటుంది.
ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన గరిష్టంగా రెండు సర్వీస్ స్టేషన్లలో 5,000 లీటర్ల వరకు కిరోసిన్ను నిల్వ ఉంచుకోవచ్చు. పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు పెట్రోలియం రూల్స్-2002 లోని కొన్ని నిబంధనల నుండి మినహాయింపు ఇచ్చారు. దీనివల్ల డీలర్లకు మరియు రవాణా వాహనాలకు లైసెన్సింగ్ ప్రక్రియ సులభతరం అవుతుంది. ఈ సడలింపులు తక్షణమే అమలులోకి వచ్చాయని, ఇవి 60 రోజుల పాటు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు, పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితులు, ఇంధన సరఫరా గొలుసుపై వాటి ప్రభావాన్ని సమీక్షించడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో మంత్రుల బృందం (IGoM) సమావేశమైంది. ఇంధన భద్రత, నిత్యావసర వస్తువుల లభ్యత మరియు మౌలిక సదుపాయాల స్థితిగతులపై ఈ సమావేశంలో చర్చించారు. అంతర్జాతీయ సంక్షోభం దృష్ట్యా ప్రజలకు ఇంధన కొరత లేకుండా చూడటంపై ప్రభుత్వం దృష్టి సారించింది.