అడ్రస్ ప్రూఫ్ అక్కర్లేదు.. ఇక సులభంగా 5 కిలోల గ్యాస్ సిలిండర్లు!
దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సిలిండర్ల లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా 5 కిలోల ఎఫ్టిఎల్ సిలిండర్ల విక్రయాలను వేగవంతం చేసింది.
By - అంజి |
అడ్రస్ ప్రూఫ్ అక్కర్లేదు.. ఇక సులభంగా 5 కిలోల గ్యాస్ సిలిండర్లు!
దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సిలిండర్ల లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా 5 కిలోల ఎఫ్టిఎల్ (FTL - Free Trade LPG) సిలిండర్ల విక్రయాలను వేగవంతం చేసింది. వీటికి ఎటువంటి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండానే, కేవలం గుర్తింపు కార్డు (ID Proof) చూపించి గ్యాస్ ఏజెన్సీల వద్ద నేరుగా కొనుగోలు చేయవచ్చు. ఈ నిర్ణయం వల్ల సామాన్యులకు, వలస కార్మికులకు ఎంతో ఉపశమనం కలగనుంది.
చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 23 నుండి ఇప్పటివరకు సుమారు 6.6 లక్షల చిన్న సిలిండర్లు అమ్ముడయ్యాయి. ఒక్క ఏప్రిల్ 4వ తేదీనే 90 వేలకు పైగా సిలిండర్లు విక్రయించడం విశేషం. గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్లతో పోలిస్తే, ఈ 5 కిలోల సిలిండర్లు మార్కెట్ ధరలకే లభిస్తాయి. ప్రస్తుతం దేశంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, రోజుకు 51 లక్షలకు పైగా గృహ వినియోగ సిలిండర్లను డెలివరీ చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం డిమాండ్లో 95 శాతం బుకింగ్లు ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి.
మరోవైపు, గ్యాస్ సిలిండర్ల నల్లబజారును అరికట్టేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మార్చి నుండి ఇప్పటివరకు అక్రమంగా నిల్వ ఉంచిన 50,000 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 1,400 మంది డిస్ట్రిబ్యూటర్లకు నోటీసులు జారీ చేయగా, 36 డీలర్షిప్లను రద్దు చేశారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు మరియు గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ సరఫరాను క్రమబద్ధీకరిస్తున్నారు.
సహజ వాయువు (Natural Gas) విషయానికి వస్తే.. గృహాలకు మరియు రవాణా రంగానికి పూర్తిస్థాయి సరఫరా కొనసాగుతోంది. ఏప్రిల్ 6 నుండి ఎరువుల కర్మాగారాలకు సరఫరాను 90 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్రోల్ బంకుల్లో కూడా తగినంత నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళనతో ముందస్తుగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని (Panic Buying) మంత్రిత్వ శాఖ సూచించింది.