సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్

కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  12 Sep 2024 1:12 AM GMT
సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్

కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. 70 ఏళ్లు ఆ తర్వాత ఏళ్లు పైబడిన వృద్ధుల ఆరోగ్య సంక్షేమం కోసం పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించింది. ఆదాయంతో నిమిత్తం లేకుండా వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌మంత్రి జన్‌ ఆరోగ్య యోజన వర్తింపజేయనున్నట్లు తెలిపింది. ఈ పథకం కింద రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశం కాగా.. ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు కేంద్రం కొత్త కార్డులను మంజూరు చేయనుంది.

ఏబీపీఎంజేఏవై కింద లబ్దిదారులుగా ఉన్నా 70 ఏళ్లు, ఆపై వయసు సీనియర్‌ సిటిజన్లకు విడిగా ఏటా రూ.5 లక్షల ఆరోగ్యబీమా కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం. వృద్ధులు ప్రైవేట్‌ ఆరోగ్య బీమా పాలసీలు, ఈఎస్‌ఐ పథకంలో ఉన్నా కూడా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్‌ఎస్‌), మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌ (ఈసీహెచ్‌ఎస్‌), ఆయుష్మాన్‌ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఏపీఎఫ్‌) పథకాల లబ్ది పొందుతున్న వాళ్లు మాత్రం ఏబీపీఎంజేఏవై పథకాన్ని లేదంటే.. వారి స్కీమ్‌లో ఏదో ఒకదానినే ఎంచుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో 4.5 కోట్ల కుటుంబాల్లోని వృద్ధులకు లబ్ధి చేకూరనుంది.

ఏబీపీఎంజేఏవై ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యబీమా పథకమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 12.34 కోట్ల కుటుంబాల్లోని 55 కోట్ల మందికి ఈ పథకం లబ్దిచేకూరుస్తుందని వెల్లడించింది. వయసుతో సంబంధంలేకుండా కుటుంబంలోని అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథం కింద ఇప్పటికే 7.37 కోట్ల మంది ఆస్పత్రిలో వైద్యసేవలు పొందారు. వీరిలో 49 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చుచేసింది.

Next Story