రాష్ట్ర విద్యాశాఖ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఓ అధికారి నీళ్ల బాటిల్ అనుకుని పొరబాటున శానిటైజర్ తాగాడు. వెంటనే అక్కడ ఉన్న వారు అప్రమత్తమైన విషయాన్ని చెప్పడంతో.. ఉమ్మివేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ఘటన జరిగింది.
బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ రమేష్ పవార్.. మున్సిపల్ కార్పొరేషన్లో 2021-22 సంవత్సరానికి విద్యా శాఖ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నివేదిక ఇచ్చిన అందరూ కూర్చున్న సమయంలో నీళ్లు తాగేందుకు యత్నించారు. నీళ్ల బాటిల్ అనుకుని శానిటైజర్ బాటిల్ తీసుకొని కొద్దిగా తాగారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమై ఆయన్ను నిలువరించారు. అయితే.. అప్పటికే ఆయన కొద్దిగా శానిటైజర్ తాగారు. వెంటనే దానిని ఉమ్మివేశారు. వెను వెంటనే వాటర్ బాటిల్ను ఆయనకు అందించారు. అనంతరం ఆయన నవ్వారు. ఈ ఘటన జరిగిన సమయంలో బీఎంసీ విద్యా కమిటీ చీఫ్ సంధ్య దోషీ కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.