మరోసారి అర్పిత ఇంట్లో సోదాలు.. ఈ సారి రూ.29 కోట్లు, 5 కిలోల బంగారం స్వాధీనం
Bengal school jobs scam Rs 29 crore in cash 5 kg gold found at Arpita's second flat.టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో
By తోట వంశీ కుమార్ Published on 28 July 2022 10:04 AM IST
టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు నటి అర్పితా ముఖర్జీ ని అదుపులోకి విచారిస్తున్న సంగతి తెలిసిందే. గత శుక్రవారం నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.21 కోట్లు బయటపడగా.. తాజాగా మరోసారి ఆమె ఇంట్లో సోదాలు చేయగా మరోసారి భారీగా నోట్ల కట్టలు బయపడ్డాయి.
అర్పితాకు చెందిన కోల్కతాలోని రెండో అపార్ట్మెంట్లో బుధవారం మధ్యాహ్నాం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము వరకు ఈ సోదాలు కొనసాగాయి. భారీ మొత్తంలో నోట్ల కట్టలు గుర్తించడంతో వాటిని లెక్కించేందుకు బ్యాంకు నుంచి యంత్రాలను తీసుకువచ్చారు. మొత్తం రూ.29 కోట్లు ఉన్నట్లు లెక్కతేల్చారు. అంతేకాకుండా 5 కిలోల బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో బయటపడ్డ మొత్తం రూ.50కోట్లకు చేరింది.
ఇదిలా ఉంటే..దర్యాప్తులో భాగంగా నటి అర్పిత ముఖర్జీ పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ తనకు 2016 నుంచి పరిచయం ఉన్నట్లు ఆమె చెప్పారు. ఒక బెంగాలీ నటుడు తనను మంత్రికి పరిచయం చేశారని చెప్పుకొచ్చారు. మంత్రి తన ఇంటిని మినీ బ్యాంక్గా ఉపయోగించుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి బహిర్గతం చేసింది. తన ఇంట్లో దొరికిన రూ. 21 కోట్ల రూపాయల డబ్బు పార్థా ఛటర్జీదే అని ఆమె చెప్పుకొచ్చింది. ఆ డబ్బుకు పార్థా మనుషులే సెక్యూరిటీగా ఉండేవారని, వారు మాత్రమే ఆ రూమ్ లోకి వెళ్లి వచ్చే వారని అర్పిత తెలిపారు.