ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ను జూన్ 1 వరకు మంజూరు చేసింది.
By అంజి Published on 10 May 2024 2:26 PM IST
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు
ప్రస్తుతం రద్దు చేసిన ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ను జూన్ 1 వరకు మంజూరు చేసింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై స్వల్పకాలిక విచారణ అనంతరం జస్టిస్లు సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను అరెస్టు చేయడాన్ని, ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
జూన్ 2న లొంగిపోవాల్సిందిగా కేజ్రీవాల్ను ధర్మాసనం ఆదేశించింది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ను మార్చి 21వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోని తీహార్ జైలులోనే ఉన్నారు. కేజ్రీవాల్ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, జూన్ 5వ తేదీ వరకు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ పొందవచ్చా అని కోర్టును అడిగారు. దీనికి జస్టిస్ ఖన్నా “లేదు” అని బదులిచ్చారు.
కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి ఈరోజే విడుదలయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ తరపు న్యాయవాది షాదన్ ఫరాసత్ తెలిపారు. మధ్యంతర బెయిల్ జూన్ 1వ తేదీ వరకు ఉంది.. జూన్ 2న లొంగిపోవాల్సి ఉంది.. ఈ విషయం మౌఖికంగా చెప్పాను.. ఆర్డర్ను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత అందులో ఇంకా ఏముందో చూద్దాం.. మేం శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. కేజ్రీవాల్ను ఈరోజు విడుదల చేసేలా చూసుకోవాలి అని ఫరాసత్ అన్నారు.
సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఆర్డర్ను అనుసరించి, కేజ్రీవాల్ తరపు న్యాయవాది ట్రయల్ కోర్టుకు వెళతారు, అక్కడ విడుదల ఆర్డర్ను సిద్ధం చేసి తీహార్ జైలు పరిపాలనకు పంపుతారని వర్గాలు తెలిపాయి. ట్రయల్ కోర్టు విడుదల ఉత్తర్వులు అందిన తర్వాత మాత్రమే కేజ్రీవాల్ను జైలు అధికారులు విడుదల చేస్తారని వారు తెలిపారు.