AI సమ్మిట్లో 'షర్ట్లెస్' నిరసన.. మరో కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్
దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరిగిన అంతర్జాతీయ AI సమ్మిట్ వేదికగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన 'షర్ట్లెస్' నిరసన వ్యవహారంలో..
By - అంజి |
AI సమ్మిట్లో 'షర్ట్లెస్' నిరసన.. మరో కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్
దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరిగిన అంతర్జాతీయ AI సమ్మిట్ వేదికగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన 'షర్ట్లెస్' నిరసన వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు ఐదో అరెస్ట్ నమోదు చేశారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జితేంద్ర యాదవ్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక AI సమ్మిట్ వేదికపైకి సుమారు 10 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, చొక్కాలు విప్పి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది.
గ్వాలియర్లో పట్టుబడిన జితేంద్ర యాదవ్ను ఢిల్లీ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం అతనికి రెండు రోజుల పోలీస్ రిమాండ్ విధించింది. ఈ కేసులో ఇప్పటికే కృష్ణ హరి అనే వ్యక్తికి చెందిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో నిరసనలో వాడిన టీ-షర్టులు, పోస్టర్లు లభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నిరసన వెనుక 'పెద్ద కుట్ర' దాగి ఉందని పోలీసులు కోర్టుకు నివేదించారు. నిరసనకారులు వాడిన పొలిటికల్ స్లోగన్లతో కూడిన టీ-షర్టుల ప్రింటింగ్ మరియు దీనికి అందుతున్న నిధుల మూలాలపై స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది.
అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువు తీసేలా ఈ నిరసన ఉందని బీజేపీ విమర్శించింది. ప్రధాని మోదీ సైతం ఈ ఘటనను కాంగ్రెస్ యొక్క "గందీ ఔర్ నంగీ" (మురికి, నగ్న) రాజకీయంగా అభివర్ణించారు. యువతలో ఉన్న ఆగ్రహాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యక్తం చేయడం తమ హక్కని కాంగ్రెస్ సమర్థించుకుంది. ప్రధాని తమ గొంతు నొక్కలేరని, ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉంటుందని కాంగ్రెస్ నేతలు ధీటుగా బదులిచ్చారు. ప్రస్తుతం మిగిలిన నిందితుల కోసం ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్లో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.