సచిన్ వాజే కేసులో మరో ట్వీస్ట్

Another twist in the Sachin Waze case.ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలున్న కారును పెట్టి బెదిరింపుల కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2021 4:59 AM GMT
Sachin Waze case

ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలున్న కారును పెట్టి బెదిరింపుల కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఓ ఇద్దరిని బూటకపు ఎన్ కౌంటర్ లో లేపేసి, ఆ కారు పెట్టిన నేరాన్ని వారిపైకి తోసేసేందుకు ఈ కేసులో ప్రధాన నిందితుడు, సస్పెండ్ అయిన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే ప్లాన్ చేసాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు చెబుతున్నారు. సచిన్ వాజే ఇంట్లో దొరికిన ఓ పాస్ పోర్ట్ ఆధారంగా తీగ లాగితే ఈ విషయాలు బయటపడ్డాయి.

పాస్ పోర్ట్ కలిగిన వ్యక్తితో పాటు మరో వ్యక్తిని ఎన్ కౌంటర్ చేసేందుకు ప్లాన్ వేశానని వాజే చెప్పినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 25న ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలున్న కారును కనుగొన్న సంగతి తెలిసిందే. అయితే, తాను అనుకున్న స్కెచ్ ప్రకారం.. ఆ ఇద్దరు ఔరంగాబాద్ లో మారుతి ఈకో కారును దొంగిలించి పేలుడు పదార్థాలను అందులో పెట్టారని కట్టుకథ అల్లేందుకు సిద్ధమయ్యాడని, అదే రోజు ఆ ఇద్దరిని ఎన్ కౌంటర్ చేసేందుకు నిర్ణయించాడని అధికారులు చెబుతున్నారు. కారు ఆ కేసును పరిష్కరించేశానని చెప్పుకోవాలని ఈ ప్లాన్ వేసాడని అయితే, ఆ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో ప్లాన్ బీకి వచ్చాడట. ఇందులో భాగంగా మన్సుఖ్ హిరెన్ అనే వ్యాపారిని ట్రాప్ చేసి, అతడి కారులోనే పేలుడు పదార్థాలను పెట్టి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడని, ఆ తర్వాత హిరెన్ ను చంపేశాడని చెబుతున్నారు.ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా పేరుండటంతో.. తనకు ఏమీ కాదులే అనే భరోసాతో ప్రణాళిక రచించినట్లు దర్యాప్తులో పాల్గొన్న ఓ అధికారి అభిప్రాయపడ్డారు.

కాగా, సచిన్ వాజే అరెస్ట్ కు ముందు వాడిన ఫోన్ కనిపించకుండా పోయిందని, అది దొరికితే కేసుకు సంబంధించిన కీలక సమాచారం దొరికే అవకాశం ఉందని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా ఆధారాలు లభ్యమయ్యేంతవరకూ ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని ఎన్ఐఏ స్పష్టం చేస్తోంది.




Next Story