సీఎం యోగిని పొగిడిన మహిళా ఎమ్మెల్యేకు ఊహించని షాక్..!
సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ను పార్టీ నుంచి బహిష్కరించింది.
By Medi Samrat
సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ను పార్టీ నుంచి బహిష్కరించింది. రెబల్ ఎమ్మెల్యే పూజా పాల్ను పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు ఓ లేఖలో సమాచారం అందించారు. సభలో సీఎం యోగి ఆదిత్యనాథ్ నీతి, శాంతిభద్రతలను ఎమ్మెల్యే పూజాపాల్ కొనియాడారు.
శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే పూజా పాల్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యొక్క శాంతిభద్రతలు, జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రశంసించారు. 'విజన్ డాక్యుమెంట్ 2047'పై జరిగిన చర్చలో ఎస్పీ ఎమ్మెల్యే పూజా పాల్ మాట్లాడుతూ.. తన భర్త హత్య కేసులో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ న్యాయం చేశారని, మాఫియాకు చెందిన నేరస్తులను శిక్షించారని అన్నారు.
ఎమ్మెల్యే పూజా పాల్ను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ జారీ చేసిన తొలగింపు లేఖలో మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని రాశారు. అనేకసార్లు హెచ్చరించినా మీరు పై చర్యలను ఆపలేదు. దీంతో పార్టీకి భారీ నష్టం వాటిల్లింది. మీ నిరంతర చర్యలు పార్టీ వ్యతిరేక, తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యం. అందుకే మిమ్మల్ని సమాజ్వాదీ పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తున్నట్లు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడి లేఖలో రాశారు. అలాగే ఆమెను పార్టీలోని ఇతర పోస్ట్ల నుండి కూడా తొలగించారు.