'అటల్‌సేతు' వంతెనపై అదుపుతప్పి కారు బోల్తా.. వీడియో

ముంబైలోని నూతన అటల్‌సేతు వంతెనపై ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి కారు బోల్తా పడింది.

By Srikanth Gundamalla  Published on  22 Jan 2024 7:01 AM GMT
accident,  atal setu bridge, mumbai,

'అటల్‌సేతు' వంతెనపై అదుపుతప్పి కారు బోల్తా.. వీడియో 

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అటల్‌సేతు వంతెనను ప్రారంభించారు. అయితే.. దాన్ని ప్రారంభించిన పది రోజులకే వంతెనపై తొలి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో కారు అతివేగంతో వచ్చి అదుపుతప్పింది. ఆ తర్వాత పల్టీలు కొడుతూ ముందుకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో పాటు చిన్నారులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలో చిర్లేకు వెళ్తున్న కారు అటల్‌ సేతుపైకి వచ్చింది. మందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నించింది.ఈ క్రమంలోనే అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దాంతో.. కారు పల్టీ కొట్టింది. అలాగే రెండూమూడు పల్టీలు కొడుతూ ముందుకు వెళ్లి ఆగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో అక్కడే వెళ్తున్న కారు కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కాగా.. ఈ ప్రమాదంతో మిగతా వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు కారు బోల్తా పడ్డ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ప్రయాణికులు గాయాలతో బయటపడినట్లు పోలీసులు చెప్పారు.

అయితే.. కారు ఇంకాస్త వేగంగా ఉంటే సముద్రంలో పడిపోయేదని అక్కడున్నవారు చెబుతున్నారు. అటల్‌సేతు వంతెన ప్రారంభించిన తర్వాత ఇదే తొలి ప్రమాదమని పోలీసులు చెప్పారు. గాయపడిన ఇద్దరు మహిళలు, చిన్నారులను ముంబై ట్రాఫిక్‌ పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. జనవరి 12న అటల్‌సేతు వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించినర విషయం తెలిసిందే.

Next Story