విషాదం.. కూలిన వంతెన.. నలుగురు మృతి, 51 మందికి గాయాలు

పూణేలో కురిసిన భారీ వర్షానికి 30 ఏళ్ల నాటి వంతెన కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా, 51 మంది గాయపడ్డారు.

By అంజి
Published on : 16 Jun 2025 6:28 AM IST

4 dead, 51 injured, old Pune bridge collapse, swelling river

విషాదం.. కూలిన వంతెన.. నలుగురు మృతి, 51 మందికి గాయాలు

ఆదివారం మధ్యాహ్నం పూణేలో కురిసిన భారీ వర్షానికి 30 ఏళ్ల నాటి వంతెన కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా, 51 మంది గాయపడ్డారు. ఉప్పొంగుతున్న నదిని చూడటానికి దాదాపు 125 మంది పర్యాటకులు దానిపై గుమిగూడగా, వంతెన కూలిపోయి ఇంద్రాయణి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. గాయపడిన వారిని నగరంలోని వివిధ ఆసుపత్రులలో చేర్చారు.

నివేదికల ప్రకారం.. వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో వాహనాల రాకపోకలకు అనుమతి లేదు. అయినప్పటికీ, నది ఉప్పొంగుతుండటం చూడటానికి పర్యాటకులు దానిపైకి పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దీనితో పాటు బలమైన నీటి ప్రవాహం కారణంగా వంతెన కూలిపోయింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), స్థానిక పోలీసులు మరియు జిల్లా యంత్రాంగం బృందాలు సహాయక చర్యలలో చురుకుగా పాల్గొంటూ, యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాయి.

వంతెన కూలిపోయిన తరువాత జరుగుతున్న సహాయక చర్యల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కూడా మాట్లాడారు. ప్రస్తుతం సైప్రస్‌లో ఉన్న ప్రధానమంత్రి మోదీకి, బాధితులకు సహాయం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి వివరించినట్లు ఏఎన్‌ఐ నివేదించింది. పూణే వంతెన కూలిపోయిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. విషాదం జరిగిన వెంటనే సహాయక చర్యల్లో చేరిన NDRF బృందాలు చాలా మంది ప్రాణాలను కాపాడాయని అన్నారు.

Next Story