ముగ్గురు మహిళలకు కరోనా టీకాకు బదులు రేబిస్ వ్యాక్సిన్.. పరిస్థితి ఎలా ఉందంటే..
3 women given anti-rabies injection instead of Covid-19, one critical. ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలోకరోనా వ్యాక్సిన్ బదులు రేబిస్ టీకాలు వేసి పంపించారు.
By Medi Samrat Published on 9 April 2021 12:15 PM GMT
ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలోని కంధాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో దారుణం చోటుచేసుకుంది. గురువారం కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెళ్లిన ముగ్గురు మహిళలకు.. అక్కడి హెల్త్ సెంటర్ సిబ్బంది రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం కలకలం రేపింది. టీకా తీసుకున్న ముగ్గురిలో ఒకరు అనారోగ్యం పాలవడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది. సరోజ్ (70), అనార్కలి (72), సత్యవతి (60) అనే ముగ్గురు మహిళలు కలిసి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకునేందుకు ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. వెంటనే అక్కడి వైద్య సిబ్బంది ఒక్కొక్కరితో రూ. 10 సిరంజిలు కొనిపించారు. అనంతరం వారికి కరోనా వ్యాక్సిన్ బదులు రేబిస్ టీకాలు వేసి పంపించారు.
అయితే.. టీకా వేయించుకుని ఇంటికి వెళ్లిన సరోజ్కు మత్తుగా, అసౌకర్యంగా ఉన్నట్టు అనిపించింది. ఆమె అదో రకంగా ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యుడు ఆమెకు రేబిస్ టీకా వేసినట్టు గుర్తించాడు. దీంతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ వేసిన సిబ్బందిపై మండిపడ్డారు. మరీ ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం ఏంటని సిబ్బందిని నిలదీశారు. ఈ విషయమై షామ్లీ సీఎంవో సంజయ్ అగర్వాల్కు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. నిర్లక్ష్యంగా వ్యహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.