GOOD NEWS: పట్టణాల్లో ఇళ్లు లేని వారికి శుభవార్త
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన - అర్బన్ 2.0 (PMAY-U 2.0) పథకంలో భాగంగా...
By - అంజి |
GOOD NEWS: పట్టణాల్లో ఇళ్లు లేని వారికి శుభవార్త
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన - అర్బన్ 2.0 (PMAY-U 2.0) పథకంలో భాగంగా మరో కీలక అడుగు పడింది. PMAY - U 2.0 కింద కొత్తగా 2.88 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో మహిళలకు 1.60 లక్షల గృహాలు, సీనియర్ సిటిజన్లకు 22,581, ఎస్సీలకు 35,525, ఎస్టీలకు 9,773, ఓబీసీలకు 82,190 ఇళ్లను కేటాయించనుంది. దీంతో ఈ స్కీమ్లో పట్టణాలకు మంజూరు చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 13.61 లక్షలకు చేరింది.
2026, ఫిబ్రవరి 23న న్యూఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ కటికితల అధ్యక్షతన 6వ సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (CSMC) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 2,87,618 లక్షల కొత్త ఇళ్లను మంజూరు చేశారు. దీనితో PMAY-U 2.0 కింద మంజూరైన మొత్తం ఇళ్ల సంఖ్య 13.61 లక్షలకు చేరింది. ఈ విడతలో మొత్తం 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇళ్లు మంజూరయ్యాయి. అందులో తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మొదలైనవి ఉన్నాయి
ఈ పథకంలో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు మరియు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలు: 2.88 లక్షల ఇళ్లలో 1.60 లక్షల కంటే ఎక్కువ ఇళ్లు మహిళలకు (భర్త చనిపోయినవారు, ఒంటరి మహిళలతో సహా) కేటాయించారు. ట్రాన్స్జెండర్లకు 8 గృహాలు మంజూరు చేశారు. సీనియర్ సిటిజన్లకు 22,581 ఇళ్లు మంజూరు చేశారు. కులం వారీగా: ఎస్సీ (SC) - 35,525, ఎస్టీ (ST) - 9,773, ఓబీసీ (OBC) - 82,190 లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు.
వలస కార్మికులు, పారిశ్రామిక కార్మికులు మరియు వీధి వ్యాపారుల కోసం అద్దె ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, రాజస్థాన్లలో ఆధునిక మరియు తక్కువ ఖర్చుతో కూడిన నిర్మాణ పద్ధతులను ప్రదర్శించేందుకు ప్రత్యేక ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఇళ్ల నిర్మాణం రవాణా సౌకర్యాలకు దగ్గరగా ఉండాలని, నగర పరిధిలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. 2015 నుండి కొనసాగుతున్న PMAY-U పథకం కింద ఇప్పటివరకు మొత్తం 122.50 లక్షల ఇళ్లు మంజూరు కాగా, అందులో 97 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అందాయి.
ఈ పథకం పట్టణ పేదలకు మరియు మధ్యతరగతి కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించడమే కాకుండా, వారికి ఆర్థిక మరియు సామాజిక భద్రతను కల్పిస్తుంది.