అట్టహాసంగా 'నారీ శక్తి పురస్కారాల' ప్రదానోత్సవం
By అంజి Published on 8 March 2020 10:47 AM GMTముఖ్యాంశాలు
- రాష్ట్రపతి భవన్లో నారీ శక్తి పురస్కారాల ప్రదానం
- శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడాల భూదేవికి పురస్కారం
- ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న భూదేవి
ఢిల్లీ: సమాజంలో నేడు అనేక మంది మహిళలు వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8వ తేదీన.. రాష్ట్రపతిభవన్లో నారీ శక్తి పురస్కారాల ప్రదానం కార్యక్రమం జరిగింది. మహిళ సంక్షేమం కోసం విశేష కృషి చేసిన వారికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. 12 మంది మహిళలను పురస్కారాలకు ఎంపిక చేయగా.. రాష్ట్రపతి భవన్లో రామ్నాథ్ కోవింద్ పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
గతంలో అథ్లెటిక్ క్రీడాకారిణిగా రాణించి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా కార్యక్రమం కోసం పని చేస్తున్న 103 ఏళ్ల మన్కౌర్కు నారీ శక్తి పురస్కారం ప్రదానం చేశారు.
బీహార్కు చెందిన బినా దేవీకి ఈ పురస్కారం అందజేశారు. పుట్టగొడుగుల సాగుతో మశ్రూమ్ మహిళగా బినాదేవి పేరుపొందారు.
ఇండియన్ ఎయిర్ఫోర్స్ తొలి మహిళా ఫైటలర్ పైలట్స్ మోహన్ జితర్వాల్, అవని చతుర్వేది, భావన కాంత్కు ఈ పురస్కారాలు దక్కాయి.
Also Read:
సీఆర్పీఎఫ్ మహిళా యోధురాళ్ల సాహసోపేత గాథ..
మనిషి నిత్య విద్యార్థి అని.. కేరళకు చెందిన 96 ఏళ్ల కార్తియాని అమ్మ నిరూపించింది. ఏదో తూతూ మంత్రంగా కాకుండా ఫైనల్ ఎగ్జామ్స్లో 100కు 98 మార్కులు సాధించింది. ఈ కార్యక్రమంలో కార్తియాని అమ్మ అందరిని ఆకర్షించారు. ఆమె వేదిక మీదకు రాగానే అందరూ చప్పట్లు కొట్టారు. ఆమెకు రాష్టపతి కొవింద్ నారీ శక్తి పురస్కారం అందించారు. గతంలో తనకు కంప్యూటర్ నేర్చుకోవాలని ఉందని తన మనసులో ఉన్న మాటను ఈ కేరళ బామ్మ చెప్పింది.
ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడాల భూదేవి కూడా పురస్కారం అందుకుంది. వ్యవసాయం, వ్యాపారం ఏక కాలంలో నిర్వహిస్తున్న పడాల భూదేవి అందరిని ఆకట్టుకున్నారు.