2కి.మీ దాటి వెళ్లకండి.. వాహనదారులకు పోలీసుల హెచ్చరిక

By సుభాష్  Published on  29 Jun 2020 3:13 AM GMT
2కి.మీ దాటి వెళ్లకండి.. వాహనదారులకు పోలీసుల హెచ్చరిక

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కొరలు చాస్తోంది. ప్రపంచ దేశాలను సైతం పట్టిపీడిస్తోంది. ఇక మహారాష్ట్రలో అయితే కరోనా కేసులకు అంతే లేదు. రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ముంబై పోలీసులు వాహనదారులకు పలు సూచనలు జారీ చేశారు. ముంబై వాసులు తమ ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లకూడదని సూచిస్తున్నారు. రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతుండటంతో పోలీసులు ఈ విజ్ఞప్తి చేశారు. కార్యాలయాలకు వెళ్లేవారు, అత్యవసర సేవల సిబ్బందికి మాత్రమే రెండు కిలోమీటర్ల దూరం దాటి వెళ్లేందుకు అనుమతులు ఉంటాయని పేర్కొన్నారు.

కరోనా కట్టడి కోసం చర్యలు

మహారాష్ట్రలోని ముంబైలో కరోనా కేసులు ఎక్కువ కావడంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇక మీదట ప్రజలు తమ ఇంటి నుంచి రెండు కిలోమీటర్లు దాటి వెళ్లినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు బయటకు వెళ్లే వారు మాస్కులు తప్పనిసరిగ్గా ధరించాలని, లేనియెడల కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా కేసులతో ముంబై అతలాకుతలం అవుతోంది. మరణాలు కూడా తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం లేకుండా పోతోంది. దీంతో ప్రభుత్వానికి, పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.

Next Story