ధోని తీసుకున్న నిర్ణయం చెన్నైకి లాభమా..? నష్టమా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Sep 2020 3:00 PM GMT
ధోని తీసుకున్న నిర్ణయం చెన్నైకి లాభమా..? నష్టమా..?

కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో ప్రారంభం కావాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) వాయిదా పడిన సంగతి తెలిసిందే. అన్ని అవాంతరాలు దాటుకుని ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. కాగా.. నిన్న బీసీసీఐ ఈ సీజన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంఫియన్‌ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

ఎందుకంటే.. ఇటీవల చెన్నై జట్టులో కరోనా కలకలం రేగింది. దీంతో జట్టు క్వారంటైన్‌ను పెంచారు. అందరి కంటే లేటుగా ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది. ఇద్దరు కీలక ఆటగాళ్లు (సురేష్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌) దూరం అయ్యారు. మరో 14 రోజుల్లో ఐపీఎల్ అంటూ.. కోహ్లీ, దినేశ్‌ కార్తీక్‌ ఫోటో ఐపీఎల్‌ ట్విట్టర్‌లో పెట్టినప్పుడు మొదటి మ్యాచ్‌ కోల్‌కతా, బెంగళూరు మధ్య జరుగుతుంది అంతా బావించారు. కాగా.. చెన్నై కెప్టెన్‌ ధోని తీసుకున్న నిర్ణయం వల్లే చెన్నై మొదటి మ్యాచ్‌లో ఆడుతుందట.

అయితే.. తొలి మ్యాచ్‌ ఆడేందుకు చెన్నైకి ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ ఓ ఆఫర్‌ ఇచ్చారట. 19న ఆడతారా..? లేదా 23 ఆడతారా అనేది చెన్నై నిర్ణయానికే వదిలేశారట. 23న ఆడితే.. మరో ఐదు రోజులు చెన్నై ప్రాక్టీస్‌కు వీలు దొరికే అవకాశం ఉంటుందని అలా చేశారట. అయితే.. కెప్టెన్‌ ధోని మాత్రం 19నే మ్యాచ్‌ ఆడాలన్న నిర్ణయం తీసుకున్నాడ. తన కెరీర్‌లో ఎన్నోసార్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ధోని మరో సారి కఠిన నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఇలా చేయడం వల్ల మొదటి ఆరు రోజుల్లోనే చెన్నై మూడు మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. ఏ మాత్రం రెస్ట్ ఉండదు.. అయినా సరే.. 19కే మ్యాచ్‌ ఆడాలన్న నిర్ణయం ధోనీ తీసుకున్నాడని తెలిసింది.

19న చెన్నై మొదటి మ్యాచ్‌లో ముంబైతో తలపడనుండగా.. 22న రాజస్థాన్‌తో, 25న ఢిల్లీతో ఆడాల్సి ఉంది. మరీ తీసుకున్న నిర్ణయం చెన్నైకు ఎంత మేరకు ఉపకరిస్తుందో చూడాలి మరీ.

Next Story