ఎమ్ఐఎమ్ పాకిస్తానీ పార్టీ.. అందుకే వారితో ఆ సమస్య..
By అంజి Published on 18 Jan 2020 9:36 AM GMTనిజామాబాద్: మేయర్ గెలిస్తే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామన్నారు గోషీమహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. నిజామాబాద్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ కార్యాక్రమంలో రాజాసింగ్తో పాటు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పాలనలో మున్సిపాలిటీల్లో అవినీతి పెరిగిందని రాజాసింగ్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు.. కరప్షన్ కార్పొరేషన్లుగా మారాయని పేర్కొన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు.
గంజాయి అమ్ముకునే వ్యక్తులను మేయర్ చేయాలని టీఆర్ఎస్ చూస్తోందని ఎంపీ అర్వింద్ అన్నారు. టీఆర్ఎస్కు ఓటు వేయకుంటే పెన్షన్లు ఆపేస్తామంటున్నారన్నారు. మేయర్ పదవిని కేటీఆర్ ఎమ్ఐఎమ్ పార్టీకి కట్టబెట్టాలని నిర్ణయించారని అర్వింద్ వ్యాఖ్యనించారు. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పదవి ఎమ్ఐఎమ్ దక్కనివ్వమని, ఒక సామాన్యునికి మేయర్ పదవి కట్టబెడతామన్నారు. కేంద్ర నిధులతో కార్పొరేషన్ను అభివృద్ధి చేస్తామని అర్వింద్ తెలిపారు. ఎమ్ఐఎమ్ పార్టీ పాకిస్తానీ పార్టీ అని.. దాని వల్ల తమకు సమస్య ఉందన్నారు. 39 వార్డుల్లో బీజేపీ బలమైన అభ్యర్థులను నిలబెట్టిందని తెలిపారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్కు సామాన్య ప్రజలు కనబడటం లేదని వివేక్ వెంకటస్వామి అన్నారు. కేటీఆర్ చదువుకున్న వ్యక్తిలా మాట్లాడటం లేదని, డబ్బులతో లొంగకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో గూండాగిరి, దౌర్జన్యం నడుస్తోందని వెంకటస్వామి అన్నారు.